నవతెలంగాణ- చైనా: డోక్సూరి తుపాను కారణంగా చైనా అల్లాడిపోతోంది. గత కొన్ని రోజులుగా ఆ దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా రాజధాని బీజింగ్ వరదలకు అతలాకుతలమైంది. ఈ వరదల కారణంగా సుమారు 21 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. బీజింగ్ లో ఎడతెరిపి లేని భారీ వర్షం కారణంగా వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. కార్లు, ఇతర వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. కాగా, బీజింగ్ లో ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం 140 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారని బీజింగ్ వాతావరణ శాఖ తెలిపింది. శనివారం నుంచి బుధవారం మధ్య బీజింగ్ లో 744.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. 1891లో రికార్డు స్థాయిలో 609 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని.. ఆ రికార్డు ఇప్పుడు బద్దలైందని వెల్లడించింది.