టీమిండియాకు బిగ్ షాక్

నవతెలంగాణ  – హైదరాబాద్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు నుంచి భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అకస్మాత్తుగా వైదొలిగాడు. కుటుంబంలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్ తప్పుకున్నట్టు బీసీసీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడో టెస్టులో ఓ వికెట్ తీసిన అతడు 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. అనిల్ కూంబ్లే తరువాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. దీంతో, ప్రధాని మోడీ కూడా రవిచంద్రన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత కొన్ని గంటలకే రవిచంద్రన్ ఆట నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే, తల్లి అనారోగ్యం కారణంగానే రవిచంద్రన్ మ్యాచ్‌కు దూరమైనట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. ఈ పరిస్థితుల్లో తల్లికి దగ్గరగా ఉండేందుకు రవిచంద్రన్ చెన్నై వెళుతున్నట్టు తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అతడికి తాము అండగా ఉంటామని బీసీసీఐ తెలిపింది. క్రికెటర్ల ఆరోగ్యం, వారి క్షేమమే తమకు అత్యంత ముఖ్యమని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో రవిచంద్రన్, అతడి కుటుంబం గోప్యతను గౌరవించాలని కోరింది. రవిచంద్రన్‌కు ఏ సాయం కావాలన్న చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Spread the love