– మేడే స్పూర్తితో కార్మికవర్గం బీజేపీని ఓడించాలి
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్
నవతెలంగాణ-ఆదిలాబాద్టౌన్
దేశ స్వాతంత్య్రం కన్న ముందు, తర్వాత కాలంలో కార్మికవర్గం అనేక పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాలరాస్తున్నదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. బుధవారం 138వ మేడే దినోత్సవాన్ని పురస్కరించుకోని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పట్టణంలోని సుందరయ్య భవనంలో వేడుకలు నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి కార్మికులకు, శ్రమ జీవులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ కార్మిక వర్గం ఎనిమిది గంటల పనిదినంతో పాటు అనేక హక్కులు మేడేతోనే సాధించుకున్నారన్నారు. ఎనిమిది గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచి సంఘం పెట్టుకునే హక్కును, సమ్మె చేసే హక్కును కాలరాసిందన్నారు. కార్మిక చట్టాలను యజమానులకు అనుగుణంగా కోడ్లుగా మార్చివేసిందన్నారు. దేశవ్యాప్తంగా కార్మికులు నిరసనలు తెలుపుతున్న పట్టించుకోవడం లేదన్నారు. రైతాంగ చట్టాలను కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా మార్చి 700 మంది రైతుల మరణాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కారణమైందన్నారు. కార్మిక, కర్షక వ్యతిరేక బీజేపీని ఓడించి ప్రజాస్వామిక లౌకిక వాదులను గెలిపించాలని, తద్వారా కార్మిక హక్కులు కాపాడాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. మేడే స్పూర్తితో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లంక రాఘవులు, అన్నమొల్ల కిరణ్, జిల్లా కమిటీ సభ్యులు బండి దత్తాత్రి, ఆర్.మంజుల, సీఐటీయూ నాయకులు అగ్గిమల్ల స్వామి, దర్శనాల నగేష్, పండుగ పొచ్చన్న, దేవిదాస్, హరిఫా బేగం పాల్గొన్నారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో
1886 సంవత్సరంలో కార్మికుల శ్రమదోపిడికి వ్యతిరేకంగా ఎనిమిది గంటల పని దినం కావాలని, జరిగిన పోరాటంలో అసువులు బాసిన కార్మికుల రక్తం నుంచి ఎర్రజెండా పుట్టిందని, ప్రపంచ కార్మిక వర్గపు పోరాటాలకు దిక్సూచిగా మారిందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, రిమ్స్, మున్సిపల్, సీఐటీయూ జిల్లా కార్యాలయంలో మేడే వేడుకలు నిర్వహించగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించి మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అన్నమొల్ల కిరణ్ మాట్లాడుతూ భారతదేశ కార్మికవర్గం అనేక త్యాగాల ద్వారా పోరాటాల ద్వారా సాధించిన 44 కార్మిక చట్టాలను కార్పొరేట్లకు కంపెనీల యజమానులకు చట్టాలుగా మార్చి నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకువచ్చిందని అన్నారు. ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచి కార్మికులను దోపిడీచేసేలా వెట్టిచాకిరి బానిసలుగా మారేలా విధానాలను రూపొందించిన బీజేపీని పార్లమెంటు ఎన్నికల్లో కార్మికవర్గం ఓడించాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో నేడున్న పాలకులు తిరిగి 1886 కన్నా ముందుకాలానికి కార్మిక వర్గాన్ని తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.12 గంటల పని దినాన్ని చట్టబద్ధం చేశారన్నారు. సమ్మె హక్కును సంఘం పెట్టుకునే హక్కును భేరసారాల హక్కును దూరం చేశారని, కార్మికులను తిరిగి వేతన బానిసలుగా మార్చేలా కార్మిక చట్టాల్లో మార్పులు చేసి లేబర్ కోడ్లను తీసుకువచ్చారన్నారు. ఈ లేబర్ కోడ్ ల రద్దుకై మేడే అమరవీరుల స్ఫూర్తితో కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. భారతదేశ కార్మిక వర్గం రైతాంగం నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు దారా దత్తం చేస్తున్నారన్నారు. విద్యా వైద్య రంగాలని వశం చేస్తూ వ్యాపారమయం చేసుకునేలా అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. అవినీతిపరులందరినీ బీజేపీ పార్టీలో చేర్చుకుంటూ అవినీతిని చట్టబద్ధం చేస్తున్నారని ఆరోపించారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్యన కార్మిక వర్గం మధ్యన చీలికలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. మేడే అమరవీరుల స్ఫూర్తితో కార్మిక హక్కుల సాధనకై ఎనిమిది గంటల పని దినాలకు పోరాటాలకు పునరంకితం అవుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ అధ్యక్ష, కార్యదర్శులు అక్రం ఖాన్, పెర్క దేవదాస్, పొచ్చన్న, దశాంత్, సుమన్ తాయి, ఏఆర్ఎస్ నాయకులు గంగన్న, శరత్, ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు భీంరావు, ఆశన్న, ఊశన్న, మున్సిపల్ నాయకులు అగ్గిమల్ల స్వామి, దర్శనాల నగేష్, మల్లేష్, అజీమ్ జనార్దన్ జీవన్, టీఎంఎస్ఆర్యూ నాయకులు సదానంద్, శ్రీకాంత్, అంగన్వాడీ యూనియన్ నాయకులు పార్వతి పాల్గొన్నారు.
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో…
పదేండ్ల బీజేపీ పాలనలో కార్మికులకు కార్పొరేట్ రంగాలకు ఉపయోగపడేలా చట్టాలు, ఇతర కార్యక్రమాలు చేపట్టిందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ అన్నారు. మేడే సందర్భంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని నేతాజీచౌక్లో కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంలోనీ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక విధానాలు, పోరాటల గురించి తెలియాజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ మాట్లాడుతూ 138 ఏండ్ల క్రితం పోరాడి 8 గంటల పని దినాలు సాధించుకున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ వాటిని తొలగించి కార్పోరేట్ సంస్థలకు అనుగుణంగా చట్టాలను తీసుకువస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్, ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి గాజంగుల రాజు, మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంతెన కాంతారావు, అధ్యక్షుడు మెరుగు చిరంజీవి, జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, జిల్లా నాయకులు అశోక్, సురేష్, తెలంగాణ మెడికల్ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు డొంగ్రే చందు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ముజీప్, రిమ్స్ బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి ఖాసీం, జిల్లా నాయకులు శ్రీకాంత్, రవి, రమేష్, సంగీత, సివిల్ సప్లరు హమాలి వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబయ్య, జిల్లా అధ్యక్షుడు అప్రోజ్, సలీం, మార్కెట్ యార్డ్ యూనియన్, హమాలి యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
ఐఎప్టీయూ ఆధ్వర్యంలో…
వందేండ్ల క్రితం పోరాడి సాదించిన కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం నాలుగు కోడ్లుగా చేసి కార్మికులకు తీరని అన్యాయం చేసిందని ఐఎఫ్టీయూ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి టీ.శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో పిట్టలవాడలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కార్మిక చట్టాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియూ జిల్లా కార్యదర్శి వెంకట నారాయణ, పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ, జిల్లా కన్వీనర్ కళావతి, ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.రాజు, పీడీఎస్ఈయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హరిష్, మడావి గణేష్, సుభాష్, నర్సింగ్, దేవిదాస్ పాల్గొన్నారు.
సీపీఐ ఆధ్వర్యంలో
అమెరికా చికాగో నగరంలో పుట్టిన ఎర్రజెండా నేడు కార్మికుల హక్కుల కోసం ఉద్యమిస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్రెడ్డి తెలిపారు. సీపీఐ పార్టీ కార్యాయలంలో బుధవారం 138వ మేడేను పురస్కరించుకోని పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. కార్మికులు, పార్టీకి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 8 గంటల పని దినాల కోసం అమెరికా చికాగో నగరంలో కార్మికులు ఐక్యంగా ఉండి ఉద్యమించారన్నారు. అక్కడి ప్రభుత్వం కాల్పులు జరపడంతో రక్తపు మడుగులో షార్టులను ముంచి ఎర్ర జెండాను చేశారన్నారు. అదే నేడు కార్మికులకు అండగా ఉంటూ పోరాడుతుందన్నారు. ప్రభుత్వాలు కూడా కార్మికుల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నళినిరెడ్డి, కుంటాల రాములు, దేవిదాస్, అమినా, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ కార్మిక హామాలీ యూనియన్ ఆధ్వర్యంలో…
హామాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని తెలంగాణ కార్మిక హామాలీ యూనియన్ డైరెక్టర్ సిడాం రాంకిషాన్ ఆరోపించారు. బుధవారం మేడేను పురస్కరించుకోని యూనియన్ ఆధ్వర్యంలో కిసాన్ చౌక్లో జెండాను ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, సమస్యలపై చర్చించారు. పట్టణంలోని హమాలీ కార్మికులు అనేక సమస్యలతో బాదపడుతున్నారని అన్నారు. ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లిన పరిష్కరించడం లేదన్నారు. కార్మికులకు రేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు, ఇండ్లతో పాటు సంఘ భవనం కూడా లేదన్నారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తమకు నమ్మకం ఉందని సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు షేక్ బాబు, అహ్మద్, మనోజ్ చౌదరి, అశోక్, జావిద్ ఖాన్ పాల్గొన్నారు.
ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో…
ఎందరో మహానుభావులు కార్మిక నాయకులు వాళ్ల త్యాగాలు ఫలితంగానే నేడు కార్మికులు ఎనిమిది గంటల పని దినాన్ని అనుభవిస్తున్నారని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి భీమ్రావు అన్నారు. బుధవారం ఆర్టీసీ డీపో ఎదుట మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరించారు. అనంతరం కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విపరీతమైన పని భారం శ్రమ దోపిడీ నిత్యాకృత్యమైనాయి, సంస్థలో సంఘాలు లేవని పేరు మీద అధికారులు తమ ఇష్టారీత్యంగా కార్మికులపై వేధింపులకు దిగుతున్నారన్నారు. చాలీచాలని వేతనాలతో 2013 సంవత్సరపు వేతన సవరణ వేతనాలు ఇప్పటికి తీసుకుంటూ దయనీయంగా జీవితాలను వెలదీస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికులు ఓ పక్క అధికారుల వేధింపులు పనిబారాలు పెంపు, దానికి సరిపడా ఓవర్ టైం చెల్లించకుండా శ్రమదోపిడి, ఈ విధంగా అడిగే నాధుడే లేడని ధీమాతో అధికారులు కార్మికులపై జలూం చలాయిస్తున్నారన్నారు. ఇక నుండి ఇలా నడవడానికి వీల్లేదని కార్మికులు ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధన కోసం ఎస్డబ్ల్యుఎఫ్, సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటానికి ముందు ఉంటామని తెలియజేశారు. కార్యక్రమంలో అనిత, ఎం.నారాయణ, ఊశన్న, ఎస్వి సాగర్, అధ్యక్ష కార్యదర్శులు అశోక్, ఎం.ఆశన్న, సురేష్, నారాయణ, వెంకటేష్, దేవిదాస్, అనిల్, సుభద్రభాయి, గోదావరి, ప్రమీల, నస్రినా బేగం పాల్గొన్నారు.
ఉట్నూర్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ, కార్మిక పోరాట త్యాగాలా ద్వారా సాధించించుకున్న 8 గంటల పని స్థానంలో కార్పొరేట్ కంపెనీలకు, యజమానులకు లాభమయ్యే విధంగా 12 గంటల పని విధానం తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను మానుకోవాలని టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ అన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన మేడే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చి కార్మికులపై భారాలు మోపుతుందన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రయివేటు పరంగా చేస్తూ, దేశ సంపదను కార్పొరేట్ బడా బాబులకు దోచి పెడుతుందని అన్నారు. ప్రజల్లో మతం ఆధారంగా విభజన తీసుకువచ్చి ప్రజల మధ్య వైషమ్యాలు తెస్తుందని దుయ్యాబట్టారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆనంద్, రత్నమాల, నైతం శోభా, నర్మధ, శ్రీను, గ్రామ పంచాయితీ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన, ఆశ కార్మికులు పాల్గొన్నారు.
గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో…
మండలంలోని కేబీ కాంప్లెక్స్, అంగడి బజార్, ఎన్ఆర్ నగర్, పాత ఉట్నూర్, కొత్త బస్టాండ్, ఐటీడీఏ చౌరస్తా, తెలంగాణచౌక్, నవోదయ నగర్, హనుమాన్ నగర్, పాత బస్టాండ్ ఆర్టీసీ కార్మికులు, తాపిమేస్త్రి, గ్రామపంచాయతి కార్మికులు, విద్యుత్శాఖ కార్మికులతో పాటు ఉట్నూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో మేడే జెండాలను ఎగురవేశారు. బుధవారం ఈ సందర్భంగా గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నేతావత్ రాందాస్ మాట్లాడుతూ 1886 మే 1న అమెరికా చికాగో నగరంలోని హే మార్కెట్లో 8 గంటల పని దినం కోరుతూ లక్షలాది కార్మికుల ప్రదర్శనపై ఆనాటి పాలకవర్గం ఆదేశాలతో పోలీసులు ప్రదర్శన కారులపై విచక్షణంగా రహితంగా కాల్పులు జరిపారు. అయినప్పటికి కార్మికులు వెనక్కి తగ్గలేదు. ఆ పోరాటంతోనే కార్మికులు 8 గంటల పని దినాన్ని సాధించుకున్నారు. ఆ దినాన్ని తలుచుకొని మే 1న మేడే వేడుకలుగా నిర్వహిస్తున్నామని అన్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి పెరుగుతున్న నిత్యవసర ధరలను అనుగుణంగా కార్మికుల వేత్తనాలు పెంచడానికి గతంలో ప్రభుత్వం జీవో జారీ చేసింది. జనవరి 1 నుంచి కార్మికుల వేత్తనాలు పెంచాల్సి ఉంది కానీ అది జరగడం లేదని అన్నారు. కనీసం జారీ చేసిన జీఓలు అమలు చేసేలా ప్రభుత్వం కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు జాదవ్ గణేష్, జాదవ్ నరేష్, రాథోడ్ నాందేవ్, రాథోడ్ ధర్మరాజ్, రాథోడ్ లాల్సింగ్, ఆడే రవీందర్, ఆడే దేవ్రావు, టేకుల వెంకటేష్, గడ్డం శ్రీనివాస్, చాకటి మాణిక్రావు, టేకుల గంగాధర్, తాపిమేస్త్రీ సంఘం అధ్యక్షులు, కార్యదర్శి, నాయకులు పాల్గొన్నారు.
కార్మికులకు సన్మానం
మండలంలోని లక్కారం గ్రామపంచాయతీ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న వారికి సామాజిక కార్యకర్త అజ్మీరా జయచంద్ర నాయక్ బుధవారం శాలువాలతో సన్మానించి, మిఠాయిలు తినిపించి, కార్మికుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో కార్మికుల పాత్ర కీలకమని, కష్టానికి ఫలితం ఎప్పుడు ఉంటుందని అన్నారు. కార్మికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సంతోషంగా తమ విధులను నిర్వహించు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
లక్ష్మణచాంద: మండలకేంద్రంలో మేడే దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. సీఐటీయూ నాయకురాలు బాపట్ల లలిత ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి, సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రత్నమాల, పెద్దమ్మ, ప్రేమల, ఆశ, విజయ, వనిత పాల్గొన్నారు.
కడెం: మండల కేంద్రంతో పాటు మండలలలోని పలు గ్రామాల్లో బుధవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీసీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కార్మిక జెండాలను డివిజన్ కార్యదర్శి రాజేష్ ఎగరవేశారు. అలాగే మండల కేంద్రంలోని ఆటో స్టాండ్ వద్ద సీఐటీయూ జెండాను నిర్మల్ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి డాకూరి తిరుపతి ఎగరవేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ డివిజన్ కార్యదర్శి రాజేష్ మాట్లాడారు. కార్మికుల పోరాటాల ఫలితంగా 8 గంటల పని దినాన్ని సాధించుకున్న తరణంలో కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్ లను రద్దు చేస్తూ 4 కోడ్లుగా కుదించడం సరికాదని మండిపడ్డారు. కార్మికుల హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా కోశాధికారి దుర్గం లింగన్న, నాయకులు చిన్న రాజన్న, రాజేశ్వర్, సత్తన్న, నిర్మాణ సంఘ జిల్లా అధ్యక్షులు కోటన్న, భీమన్న పాల్గొన్నారు.
ఖానాపూర్: మండలంలో ఆయా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 138వ మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బుధవారం సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో నందిరామయ్య, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు సునారికారి రాజేష్, రైతు సంఘం, సీఐటీయూల ఆధ్వర్యంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాగేల్లి నర్సయ్యలు వేర్వురుగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడే పోరాట స్ఫూర్తితో పెట్టుబడిదారుల పాలకవర్గాల దోపిడీ, దాడులు, అణిచివేతలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడి హక్కులు సాధించుకుంటూ వర్గ ఐక్యతను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
బజార్హత్నూర్: మేడేను పురస్కరించుకుని బుధవారం మండలంలోని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా మండలంలోని పలు గ్రామాలతో పాటు మండల కేంద్రంలో సీఐటీయూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద ఎర్రజెండా ఎగురవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమాలీ సంఘం అధ్యక్షులు తడక శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మిక హక్కులకై చికాగో నగరంలో లక్షలాదిమంది కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్న వారి పైన పెట్టుబడిదారీ వర్గం కాల్పులు చేపట్టడంతో కార్మికుల రక్తంతో తడిసిన జెండా ఎర్ర జెండా అని అన్నారు. కార్మికులు పోరాటాల ద్వారానే హక్కును సాధించుకున్నారు. ఆ హక్కులను కాపాడుకోవాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా బాధ్యులు సురేష్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మోత్కూరి దేవేందర్, హమాలీ కార్మికులు, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్రూరల్: మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రాంతికారి హమాలీ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి మేడేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం గౌరవాధ్యక్షులు షేక్ సైజాద్ హుస్సేన్ మాట్లాడుతూ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో కార్మికుల సమస్యలు ఎన్నో ఉన్నాయని అన్నారు. సమస్యలు పరిష్కరించాలని ఆధికారులకు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ స్పందిచడం లేదని అన్నారు. అధికారులు స్పందిస్తూ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా మాలిక్ కార్మిక సంఘం డైరెక్టర్ ఎల్ల సంతోష్ కుమార్ మాట్లాడుతూ మేడే సందర్భంగా కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు శాలిక్రావ్, ఉపాధ్యక్షులు ఆడే విఠల్, సంఘం జనరల్ సెక్రటరీ అఫ్రోజ్, హుస్సేన్, ముఖ్య సలహాదారులు మునేశ్వర్ సుదర్శన్, దూట రాజేశ్వర్, ఆనంద్ కుమార్, షేక్ రసూల్ పాల్గొన్నారు.
తుడుందెబ్బ ఆధ్వర్యంలో…
ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ అనుబంధ సంఘాలు కుమురంభీం గూడా నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మేడే కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంలో తుడుందెబ్బ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు గోడం గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్ మాట్లాడుతూ మేడే అంటే కార్మిక, కర్షకుల దినోత్సవమని అన్నారు. చికాగో నడిబొడ్డున చిందిన రక్తపు చిహ్నం బానిస బతుకులకు చరమగీతం పాడిన దినం మేడే అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. 8 గంటలే కార్మికులతో పని చేయించాలి కాని పెట్టుబడిదారులు ఇప్పటికీ కుడా అమాయక కార్మికులతో ఎక్కువ సమయం పని చేస్తున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ఎంతోమంది శ్రమజీవులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. వారిలో ధైర్యం నింపడం మన అందరి కర్తవ్యమన్నారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకురాలు గోడం రేణుక, సోయం లలిత, కుడ్మెత ప్రకాష్, డివిజన్ ఉపాధ్యక్షుడు, వెడ్మ ముకుంద్రావు, మావల మండలాధ్యక్షులు పంద్రం గంభీర్, పట్టణ ప్రధాన కార్యదర్శి కుమ్ర గోవింద్, గ్రామస్తులు పాల్గొన్నారు.
తాంసి: 138వ కార్మిక దినోత్సవాన్ని బుధవారం తాంసి, భీంపూర్, మండల కేంద్రంలో సీఐటీయూ అంగన్వాడీ యూనియన్ నాయకురాలు వెంకటమ్మ ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం యూనియన్ మండల అధ్యక్షులు తోట నరేందర్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కార్మిక సంఘం సభ్యులతో కలిసి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్, ఎంపీటీసీ నరేష్, కార్మిక సంఘం నాయకులు పొచ్చన్న, రతన్, విలాస్, దత్తు, రాములు పాల్గొన్నారు.
ఇచ్చోడ: మేడే స్పూర్తితో హక్కులు సాధించుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న అన్నారు. బుధవారం మండల కేంద్రంలో మేడే వేడుకలకు ఆయన ముఖ్యఅతిధిగా హజరై ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వెట్టి చాకిరికి అణచివేతకు, పీడనకు వ్యతిరేకంగా ఎనిమిది గంటల పని దినం కోసం కార్మిక హక్కుల సాధన కోసం 1886లో హే మార్కెట్లో కార్మికులు చేసిన పోరాటంపై నాటి పాలకవర్గాలు దాడిచేసి అనేకమంది కార్మిక నాయకుల్ని బలితీసుకుందని అన్నారు. ఆ త్యాగాల ద్వారానే అనేక దేశాల్లో 8 గంటల పనిదినం అమల్లోకి వచ్చిందని అన్నారు. అనంతరం కార్మికవర్గం అనేక త్యాగాల ద్వారా పోరాటాల ద్వారా కొన్ని చట్టాలను హక్కులను సాధించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షులు భూమయ్య, పవార్ జితేందర్ పాల్గొన్నారు.
నార్నూర్: మేడేను పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రంలో సీఐటీయూ, ఏఐటీయూసీ సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశాకార్యకర్తలు, మధ్యానం భోజన కార్మికుల మండల నాయకులు ఝాడే నాందేవ్, జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆయా శాఖల కార్మికులు ఝాడే తాయిబాయి, తానుబాయి, ఝారుబాయి, తులిసిబాయి, సమాధాన్ రామ్ ఉన్నారు.
తలమడుగు: మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మేడేను ఘనంగా నిర్వహించారు. మొదటగా జెండా ఆవిష్కరించారు. అనంతరం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న మాట్లాడుతూ భారతదేశ కార్మికవర్గం అనేక త్యాగాల ద్వారా పోరాటాల ద్వారా సాధించిన 44 కార్మిక చట్టాలను కార్పొరేట్లకు కంపెనీల యజమానులకు చుట్టాలుగా మార్చి నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకువచ్చిందన్నారు. ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచి, కార్మికులను దోపిడీచేసేలా వెట్టిచాకిరి బానిసలుగా మారేలా విధానాలను రూపొందించిన బీజేపీ ప్రభుత్వాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో కార్మికవర్గం ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆత్రం కిష్టన్న, సీఐటీయూ తలమడుగు మండల నాయకులు కళావతి, మంజుల, రమణ, గంగమ్మ, కృష్ణ, గంగన్న, ప్రమోద్, భూమన్న పాల్గొన్నారు.