Thursday, August 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅన్నదాతల హక్కుల కోసం పోరాడిన యోధుడు బోడేపూడి

అన్నదాతల హక్కుల కోసం పోరాడిన యోధుడు బోడేపూడి

- Advertisement -

ఖమ్మం జిల్లాలో పార్టీ విస్తరణకు కృషి
వర్థంతి సభలో వెంకట్‌, సాగర్‌, పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అన్నదాతల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన యోధుడు బోడేపూడి వెంకటేశ్వరరావు అని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ‌కొనియాడారు. బుధవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో బోడేపూడి వెంకటేశ్వరరావు చిత్రపటానికి వారు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వైరా రిజర్వాయర్‌పై ‘సుజల స్రవంతి’ పథకాన్ని సాధించి ప్రజలకు ఫ్లోరైడ్ రహిత తాగునీరు అందించడంలో ఆయన కృషి మరువలేనిదని తెలిపారు. ఆయన మరణానంతరం దానికి ‘బోడేపూడి సుజల స్రవంతి’గా నామకరణం చేశారన్నారు. వైరా కమిటీ స్కూల్, కేవీసీఎం డిగ్రీ కళాశాలల ఏర్పాటుతోపాటు జిల్లాలో విద్యావ్యాప్తికి, యువజన సంఘాల ప్రోత్సాహానికి విశేష కృషి చేశారని కొనియాడారు. ఆదర్శ వివాహాలను ప్రోత్సహించేవారనీ, కళలు, సాహిత్యం పట్ల మక్కువ చూపేవారని తెలిపారు. మధిర నియోజకవర్గం నుంచి వరసగా మూడు ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారనీ, 1989 నుంచి 1997న కన్నుమూసే వరకు సీపీఐ(ఎం) శాసనసభా పక్షనేతగా బాధ్యతలు చేపట్టారని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి మూడ్ శోభన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాద్ రావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, నాయకులు శివకుమార్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -