– స్థానిక ప్రజా ప్రతినిధులకు అందని గౌరవ వేతనం
– ఆరు నెలలుగా ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీల అవస్థలు
నవతెలంగాణ-కెరమెరి
పదవీకాలం ముగిసినా ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం అందడం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు గడుస్తున్నా ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీలు గౌరవ వేతనం అందుకోకుండానే పదవీకాలం ముగిసిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందు ప్రజాప్రతినిధులకు నామమాత్రపు వేతనాలు అందేవి. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజాప్రతినిధులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని భావించారు. ఎంపీటీసీలకు నెలకు రూ.750 ఉన్న గౌరవ వేతనాన్ని రూ.5వేలు, ఎంపీపీలకు రూ.1500ల నుంచి రూ.10వేలు, జడ్పీటీసీలకు రూ.2,250ల నుంచి రూ.10 వేలకు పెంచారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ పెరిగిన నేపథ్యంలో మరోసారి వారి వేతనాలను 30 శాతం పెంచాలని కేసీఆర్ సంకల్పించి పెంచారు. దీంతో రూ.5 వేలు ఉన్న ఎంపీటీసీల గౌరవ వేతనం రూ.6500లకు, జడ్పీటీసీ, ఎంపీపీలకు రూ.5 వేలు ఉన్న గౌరవ వేతనాన్ని రూ.13 వేలకు కేసీఆర్ ప్రభుత్వం పెంచింది. అప్పటి వరకు రూ.7,500 గౌరవ వేతనం అందుకునే జడ్పీ చైర్మెన్లకు కూడా రూ.ఒక లక్షకు పెంచి అందరూ ప్రజాప్రతినిధులను గౌరవం కల్పించి వారికి వేతనాలను సకాలంలో అందించేవారు. సమైఖ్య పాలనలో నామమాత్రపు జీతానికి పరిమితమైన ప్రజాప్రతినిధులు కేసీఆర్ పాలనలో గౌరవ వేతనం ప్రకటించి వారి కష్టానికి తగినట్లు వేతనాలు అందిచడంపై ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం మారిన అందని వేతనాలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6నెలలైనా ప్రజాప్రతినిధులకు వేతనాలు రావడం లేదు. కాగా గౌరవ వేతనం పొందకుండానే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మెన్లు పదవీ నుంచి దిగిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగినప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా గౌరవ వేతనం అందకపోవడంతో ప్రభుత్వంపై ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీలు గుర్రుగా ఉన్నారు. గత ప్రభుత్వం తమకు గౌరవ వేతనం అందించి, తగిన గుర్తింపును అందించిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ గౌరవ వేతనాలను నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగియడంతో ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు తమకు వస్తాయా..? రావా..? అనే సందిగ్ధంలో ఉన్నారు.
వినతిపత్రం అందించినా.. రానీ వేతనాలు
ఇటీవల ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు ఎంపీపీ, జడ్పీటీసీలు వినతిపత్రం అందించారు. పెండింగ్లో ఉన్న వేతనాలను ఇప్పించాలని వేడుకున్నారు. అయిన గౌరవ వేతనం అందకపోవడంపై మాజీలు కాంగ్రెస్ సర్కారు పాలనపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తొంది.
ఉమ్మడి జిల్లాలో 59 మంది జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు అందని వేతనం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు జడ్పీ చైర్మెన్లతో పాటు 59 మంది జడ్పీటీసీలు, 64 మంది ఎంపీపీలు, 507 మంది ఎంపీటీసీలకు గౌరవ వేతనం అందలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా వేతనాలు పొందిన జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆరు నెలలుగా గౌరవ వేతనాలు పొందలేదు. జూలై 4వ తేదీతో పదవీకాలం ముగిసి వీరంతా మాజీ ప్రజా ప్రతినిధులు అయినా నేటికి వేతనాల చెల్లింపుపై ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పదవీకాలం ముగిసినా గౌరవ వేతనం అందలేదు..
సయ్యద్ అబుల్ కలాం, ఎంపీటీసీ ఫోరం మాజీ జిల్లా అధ్యక్షుడు
ఉమ్మడి జిల్లాలో అనేక మంది నిరుపేదలే ఎంపీటీసీలుగా ఎన్నికయ్యారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎంపీటీసీల గౌరవ వేతనం చెల్లించేందుకు ముందుకు రాకపోవడం విడ్డూరం. కేసీఆర్ ప్రజామోద పాలనలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులందరికీ గౌరవం లభించింది. ఇక పనులు చేసిన వాటికి ఇంతవరకు బిల్లులు కూడా అందడం లేదు.
ఆరు నెలల వేతనం రావాలి..
సెడ్మాకి ద్రుపత బాయి, మాజీ జడ్పీటీసీ కెరమెరి
గత సర్కారు ఎంపీటీసీకు గౌరవ వేతనం కింద నెలకు రూ.6,500 అందిస్తామని చెప్పడంతో కొత్తగా ఎన్నికైన తమకు సంతోషం అనిపించింది. అయితే గత ఐదేండ్లలో నెలనెల వేతనం ఇవ్వకున్నా.. ఒకేసారి రెండు, మూడు నెలలవి ఖాతాల్లో జమ చేస్తుండే. గత ఆరు నెలల నుంచి ఎంపీటీసీ సభ్యులకు గౌరవ వేతనం ఇప్పటివరకు ఖాతాల్లో వేయడం లేదు. మా పదవీ కూడా అయిపోయింది. వెంటనే ఆ డబ్బులను మా ఖాతాల్లో జమ చేయాలి.
ప్రజాప్రతినిధులకు ఇచ్చే గౌరవం ఇదేనా..?
పెందూర్ మోతీరాం, మాజీ ఎంపీపీ కెరమెరి
ఆరు నెలలు గడిచినా తమకి ఇచ్చే గౌరవ వేతనం ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఏనాడూ జీతాలు ఆపలేదు. జీపీలకు నిధులు లేవు. సర్పంచ్ల ఎన్నికలు నిర్వహించే సాహసం చేయడం లేదు. పరిపాలన స్తంభించింది. పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. గ్రామాలు కంపు కొడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. వెంటనే ఎంపీటీసీల గౌరవ వేతనం విడుదల చేయాలి. లేని పక్షంలో ఆందోళనలకు వెనుకాడేది లేదు.
నిర్లక్ష్యం సరికాదు
జుమిడి సౌందర్య, మాజీ ఎంపీపీ రెబ్బెన
జిల్లాలో అనేక మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైంది. మాజీ ప్రజా ప్రతినిధుల సమస్యలు పట్టించుకోవడం లేదు. గౌరవ వేతనాల సమస్యను పంచాయతీరాజ్ మంత్రి దృష్టికి పలువురు తీసుకెళ్లడం జరిగింది. అయిన స్పందన లేదు. గౌరవ వేతనాలు చెల్లింపులు ప్రభుత్వ నిర్లక్ష్యం సరైంది కాదు.