అవినాష్‌ రెడ్డి నిందితుడని సీబీఐ ఎక్కడా చెప్పలేదు

– అవినాష్‌ తరఫు న్యాయవాది

నవతెలంగాణ హైదరాబాద్‌: మాజీమంత్రి వై.ఎస్‌.వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరుగుతుంది. అవినాష్‌ రెడ్డి తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. ఎఫ్‌ఐఆర్‌, దర్యాప్తు, కోర్టుల్లో జరిగిన పరిణామాలను కోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ‘‘అవినాష్ నిందితుడని రికార్డుల్లో సీబీఐ ఎక్కడా చెప్పలేదు. గుండెపోటు అన్నంత మాత్రాన నేరం చేసినట్టే అనడం సరికాదు. అవినాష్ వైద్యుడో, పోలీసు అధికారో కాదు కదా? ఏ1 గంగిరెడ్డికి వివేకాతో భూ వివాదాలు ఉన్నాయి. సునీల్, ఉమాశంకర్‌కు వివేకాతో వ్యాపారంలో విబేధాలున్నాయి. తమ కుటుంబ మహిళల విషయంలోనూ వారికి వివేకాపై కోపం ఉంది. డ్రైవర్‌గా దస్తగిరిని తొలగించిన వివేకా.. ప్రసాద్‌ను పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి అవినాషే కారణమని వివేకా భావించారు. వివేకా ఓటమికి కారణాలను సాక్షులే వివరించారు. స్థానిక నేతలు సహకరించకే ఓడిపోయారని సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. దస్తగిరి తీసుకున్న రూ.కోటిలో రూ. 46.70లక్షలే రికవరీ చేశారు. మిగతా సొమ్ము ఏమైందో సీబీఐ చెప్పడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎంపీ టికెట్‌పై అవినాష్‌ను సీబీఐ అనుమానిస్తోంది’’ అని జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌ వెకేషన్‌ బెంచ్‌ ముందు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు విపినించారు.

Spread the love