Tuesday, June 30, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపరస్పర దాడులు నిలిపివేత

పరస్పర దాడులు నిలిపివేత

- Advertisement -

అంగీకారానికి వచ్చిన ఇరాన్‌, అమెరికా
హార్ముజ్‌పై నేడు దోహాలో సంప్రదింపులు
నవ తెలంగాణ – జనరల్‌ డెస్క్‌

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సడలి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి. పరస్పర దాడులను నిలిపివేసేందుకు ఇరాన్‌, అమెరికా అంగీకరించాయి. హార్ముజ్‌ జలసంధిపై ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించుకోవడానికి తిరిగి సంప్రదింపులు ప్రారంభించాలని నిర్ణయించాయి. దీంతో తాత్కాలిక శాంతి ఒడంబడిక సజీవంగానే ఉంటుందన్న ఆశాభావం వ ్యక్తమవుతోంది. ‘ఎంఓయూలోని అన్ని అంశాల పైన సాంకేతిక చర్చలు కొనసాగుతాయి. ఇరు పక్షాలు దాడులకు స్వస్తి చెబుతాయి. హార్ముజ్‌లో నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు’ అని ఓ అమెరికా అధికారి తెలిపారు. ఈ నెల 17న 14 సూత్రాల అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)పై ఇరాన్‌, అమెరికా సంతకాలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారమే హార్ముజ్‌ను వాణిజ్య నౌకల రాకపోకలకు తెరిచారు. కాగా ఇరు పక్షాల మధ్య మంగళవారం ఖతార్‌లో చర్చలు ప్రారంభం అవుతాయని ఆక్సియాస్‌ వార్తా సంస్థ తెలియజేసింది.

జలసంధిలో ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకపై గురువారం ఇరాన్‌ దాడి జరిపిన నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో తిరిగి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఎంఓయూ కింద కుదుర్చుకున్న కాల్పుల విరమణను ఇరు దేశాలు బేఖాతరు చేసి దాడులు, ప్రతిదాడులకు దిగాయి. ఆదివారం ఉదయం కువైట్‌, అమెరికా స్థావరాలపై ఇరాన్‌ సేనలు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. యుద్ధాన్ని ముగించేందుకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని గౌరవించని పక్షంలో ఇరాన్‌ అనేదే ఉండదని అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేశారు. ఇరు దేశాల మధ్య తాజాగా హింస చోటుచేసుకున్నప్పటికీ ఇరాన్‌, అమెరికా అధికారులు మాత్రం నేడు దోహాలో సమావేశమవుతారు. ఎంఓయూను సజీవంగా ఉంచేందుకు, మరో సైనిక చర్య జరగకుండా నివారించేందుకు ప్రయత్నిస్తారు.

స్థిరంగా ఉన్న చమురు ధరలు
దాడులను నిలిపివేయాలని అమెరికా, ఇరాన్‌ నిర్ణయించిన నేపథ్యంలో సోమవారం చమురు ధరలు స్థిరంగా కొనసాగాయి. గల్ఫ్‌, మధ్యప్రాచ్య ఉత్పత్తిదారులు చమురు, ఎల్‌ఎన్‌జీ సరఫరాలను యధావిధిగా కొనసాగించారు. ఇరాన్‌, అమెరికా దేశాల తాజా నిర్ణయంతో మార్కెట్లు ఊరట పొందాయి. మరోవైపు గత సెషన్‌లో లాభాల పరంపరను కొనసాగించిన భారతీయ షేర్లు స్థిరంగా కొనసాగాయి. ఉదయం బెంచ్‌మార్క్‌ నిఫ్టీ 0.24 శాతం పెరిగి 24.112.35 వద్ద ముగియగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 0.16 శాతం పెరిగి 77,223.58 వద్ద నిలిచింది. మధ్యప్రాచ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై పెట్టుబడిదారులు అంచనాలు వేస్తున్న సమయంలో బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు 0.7 శాతం మేర పెరిగాయి. స్థిరమైన ముడి చమురు ధరలు దేశీయ మార్కెట్‌ సెంటిమెంటుకు మద్దతు ఇస్తున్నాయని నిపుణులు తెలిపారు.

చర్చల అజెండాను కుదించి
ఇరాన్‌ అణు కార్యక్రమంపై మరోసారి స్విట్జర్లాండ్‌లోనే చర్చలు జరపాలని తొలుత భావించారు. అయితే గత వారాంతంలో సైనిక ఘర్షణలు చోటుచేసుకోవడంతో దౌత్యవేత్తలు చర్చల వేదికను దోహాకు మార్చారు. మావేశపు ఎజెండాను కూడా కుదించారు. హార్ముజ్‌ జలసంధి చుట్టూ నెలకొన్న వివాదాల పరిష్కారానికే దానిని పరిమితం చేశారు. నేడు జరగబోయే చర్చలలో అమెరికా సాంకేతిక బృందం అధిపతి నిక్‌ స్టీవర్ట్‌ పాల్గొనే అవకాశం ఉంది. అయితే దోహా సంప్రదింపులపై అమెరికా అధ్యక్షభవనం ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు.

జలసంధి పైనే దృష్టి
దోహాలో జరగబోయే భేటీలో ముందుగా హార్ముజ్‌పై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆ తర్వాతే కీలకమైన ఇరాన్‌ అణు కార్యక్రమం, ఆంక్షల ఎత్తివేత, శాంతి ఒప్పం దాన్ని దీర్ఘకాలం అమలు చేయడం వంటి అంశాలపై దృష్టి సారిస్తారు. చర్చల అనంతరం ఎంఓయూ ఉనికిలో ఉంటుందా అనేదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. ఒకవేళ సంప్రదింపులలో పురోగతి సాధ్యపడకపోతే తిరిగి సైనిక చర్యలు ప్రారంభం కావడం అనివార్యం అవుతుంది.

హార్ముజ్‌ బాధ్యత మాదే : అరాగ్చీ
హార్ముజ్‌ జలసంధి బాధ్యత పూర్తిగా తమదేనని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ స్పష్టం చేశారు. రాబోయే 30 రోజులు హార్ముజ్‌ తమ అధీనంలోనే ఉంటుందని తెలిపారు. జలసంధి నిర్వహణ విషయంలో జోక్యం చేసుకోవద్దని అన్ని పక్షాలను కోరారు. అమెరికాతో కుదిరిన ఎంఓయూ ప్రకారం హర్ముజ్‌పై నియంత్రణ తమదేనని చెప్పారు. జలసంధిలో తాము సూచించిన మార్గాన్ని ఖాతరు చేయకపోతే ఉద్రిక్తతలు, సైనిక చర్యలు పెరుగుతాయని హెచ్చరించారు. ప్రాంతీయ భద్రతా ఫ్రేమ్‌వర్క్‌ ఏర్పాటు కోసం గల్ఫ్‌ దేశాలతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమేనని అన్నారు. ఇటీవలి పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని, ప్రాంతీయ భవిష్యత్‌ భద్రతా నిర్మాణానికి రూపు ఇచ్చేందుకు కలసి రావాలని గల్ఫ్‌ దేశాలకు సూచించారు. మరోవైపు ఖ్వోమ్‌ నగరంలో పర్యటించిన ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో ఇటీవల కుదుర్చుకున్న ఒప్పందం ఇరాన్‌ ప్రజల విజయమని ఆయన అన్నారు. ఖతార్‌లో అమెరికా స్తంభింపజేసిన 12 బిలియన్‌ డాలర్ల ఇరాన్‌ ఆస్తులలో ఆరు బిలియన్‌ డాలర్లను అమెరికా విడుదల చేసి వాపసు చేస్తుందని చెప్పారు. ఇదిలావుండగా ఇరాన్‌, ఒమన్‌ దౌత్యవేత్తలు మస్కట్‌లో సమావేశమై హార్ముజ్‌పై నియంత్రణ గురించి చర్చించారు.

భిన్న వైఖరులే ఘర్షణలకు కారణం
ఇరాన్‌, అమెరికా మధ్య కుదిరిన ఎంఓయూను అమలు చేయడానికి హార్ముజ్‌ ప్రధాన అడ్డంకిగా మారింది. జల సంధి మీదుగా వాణిజ్య నౌకల ప్రయాణం సురక్షితంగా జరిగేందుకు ప్రయత్నిస్తానని ఎంఓయూలో ఇరాన్‌ హామీ ఇచ్చింది. దీనికి ప్రతిగా అమెరికా కూడా ఇరాన్‌ ఓడరేవుల దిగ్బంధనాన్ని తొలగిస్తానని తెలిపింది. జల సంధి మీదుగా జరిగే రవాణాను సమన్వయం చేసుకోవడానికి అమెరికా దళాలు, ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూ షనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) మధ్య నేరుగా సైనిక హాట్‌లైన్‌ను ఏర్పాటు చేసేందుకు కూడా స్విట్జర్లాండ్‌ సమా వేశంలో అంగీకారం కుదిరింది. అయితే ఈ హాట్‌లైన్‌ ఇంకా ఉనికిలోకి రాలేదని అమెరికా అధికారులు చెప్పారు. అదే సమయంలో తమ అధికారులతో నేరుగా సమన్వయం చేసుకొని అనుమతి తీసుకున్న తర్వాతే హార్ముజ్‌లో నౌకలు రాకపోకలు సాగించాలని ఇరాన్‌ పట్టుపట్టింది. అయితే చర్చలలో ఈ అంశం ప్రస్తావనకు రాలేదని అమెరికా తెలిపింది. కుదిరిన అవగాహనకు మించి ఇరాన్‌ గొంతెమ్మ కోరికలు కోరుతోందని విమర్శించింది. తాజా ఘర్షణలకు ఈ పరస్పర భిన్న వైఖరులే కారణమయ్యాయి.

కాల్పుల విరమణకు విఘాతం
ఇరాన్‌, అమెరికా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి కొద్ది రోజుల వ్యవధిలోనే గ్రహణం పట్టింది. ఇరాన్‌ సైనిక స్థావరాలపై తొలుత అమెరికా దాడులు జరిపింది. దీనికి ప్రతిగా ఇరాన్‌ కూడా కువైట్ బహ్రెయినబ లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది మీరంటే మీరేనంటూ ఇరు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఎంఓయూను గౌరవించని పక్షంలో ఇరాన్‌ అనేదే లేకుండా పోతుందంటూ ట్రంప్‌ బెదిరింపులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -