మారిన పీఎఫ్ విత్ డ్రా రూల్స్

నవతెలంగాణ-హైదరాబాద్ : మీ ఈపీఎఫ్ ఖాతా నుంచి నగదును తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే! కరోనా సమయంలో తీసుకువచ్చిన కోవిడ్ అడ్వాన్స్ సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది. కరోనా కారణంగా ఉద్యోగాల కోత, వేతన కోత వంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఆర్థిక ప్రయోజనం చేకూరేలా పీఎఫ్‌ను ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించారు. ఈఫీఎఫ్ ఖాతా నుంచి 75 శాతం తీసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు, కరోనా పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో నగదు ఉపసంహరణ నిబంధలను మార్చింది. కరోనా మహమ్మారి లేనందువల్ల అడ్వాన్స్ మొత్తం తీసుకునే అవకాశాన్ని నిలిపివేసినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2020లో కరోనా మొదటి వేవ్ సమయంలో ఈపీఎఫ్ఓ ఈ సదుపాయాన్ని తీసుకువచ్చింది. రెండో వేవ్ వచ్చినప్పుడు దీనిని పునరుద్ధరించారు. దాదాపు నాలుగేళ్లు ఇది అందుబాటులో ఉంది. తొలుత ఒకసారి మాత్రమే అడ్వాన్స్ తీసుకునే వెసులుబాటు కల్పించినప్పటికీ… ఆ తర్వాత పలుమార్లు పునరుద్ధరించారు. ఇప్పుడు దీనిని నిలిపివేశారు. అడ్వాన్స్ సదుపాయం నిలిచిపోయినప్పటికీ ఇంటి కొనుగోలు, పిల్లల ఉన్నత చదువులు, ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్యం వంటి సందర్భాల్లో ఈపీఎఫ్ ఖాతాలోని నిర్దిష్ట పరిమితి మేరకు ఉపసంహరించుకోవచ్చు.

Spread the love