నవతెలంగాణ – హైదరాబాద్ : ఒకప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉన్న చికెన్, కోడిగుడ్లు ఇప్పుడు జేబుకు భారంగా మారుతున్నాయి. గత కొన్ని వారాల్లోనే వీటి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో మధ్యతరగతి కుటుంబాలు, నాన్వెజ్ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వారాంతంలో చికెన్ కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో గత వారం వరకు కిలో స్కిన్లెస్ చికెన్ రూ.280 నుంచి రూ.300 మధ్య విక్రయించారు. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రాంతాన్ని బట్టి రూ.300 నుంచి రూ.330 వరకు పలుకుతోంది. విజయవాడలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ కూడా కిలో చికెన్ రూ.320 నుంచి రూ.330 వరకు అమ్ముతున్నారు. కొన్ని రిటైల్ దుకాణాల్లో ధరలు ఇంకా ఎక్కువగా ఉన్నట్లు వినియోగదారులు చెబుతున్నారు.
చికెన్తో పాటు కోడిగుడ్ల ధరలు కూడా పెరిగాయి. నెల రోజుల క్రితం రూ.6 నుంచి రూ.7 మధ్య ఉన్న ఒక్క గుడ్డు ధర ప్రస్తుతం రూ.8కు చేరింది. దీంతో 30 గుడ్ల ట్రే కొనాలంటే దాదాపు రూ.240 ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రొటీన్ కోసం గుడ్లపై ఆధారపడే కుటుంబాలకు ఇది అదనపు భారంగా మారింది. ఈ ధరల పెరుగుదలకు పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఎండల తీవ్రతతో పౌల్ట్రీ ఫారాల్లో కోళ్ల మరణాలు పెరగడం వల్ల ఉత్పత్తి తగ్గింది. మరోవైపు మొక్కజొన్న, సోయాబీన్ వంటి దాణా ధరలు పెరగడంతో పౌల్ట్రీ నిర్వహణ వ్యయం కూడా పెరిగింది. దీంతో చాలామంది రైతులు కోళ్ల పెంపకాన్ని తగ్గించినట్లు వ్యాపారులు చెబుతున్నారు.



