– కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జయంత్ చౌదరీలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటునందించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డిని పొన్నం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో తెలంగాణకు సంబంధించిన పలు అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరిని ఆయన ఛాంబర్లో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఆయా శాఖల పరంగా అభివృద్ధికి సహకరించాలని కోరారు.దేశంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఢిల్లీ తెలంగాణ భవన్లో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి రాహుల్ బర్త్ డే కేక్ను కట్ చేశారు.