డెడ్‌లైన్‌ మార్చి 21

Deadline is March 21– ‘సెలక్టివ్‌’గా ఉండొద్దు
– సమాచారాన్ని దాచిపెట్టలేదని అఫిడవిట్‌ కూడా ఇవ్వండి : ఎస్‌బీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు
– బాండ్ల నెంబర్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీత
న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల వ్యవహారంలో సుప్రీంకోర్టు మరోసారి ఎస్‌బీఐపై మండిపడింది. బాండ్లకు సంబంధించి ఏవో కొన్ని వివరాలు అందిస్తే సరిపోదని, సమాచారం మొత్తాన్నీ ఇవ్వాల్సిందేనని సోమవారం ఆదేశించింది. బాండ్లపై ఉండే యూనిక్‌ నెంబర్లను కూడా ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని తాను గతంలో ఆదేశించానని గుర్తు చేస్తూ వాటిని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. బాండ్ల నెంబర్లతో సహా అన్ని వివరాలనూ ఈ నెల 21వ తేదీ లోగా ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని, అదే విధంగా తాను ఏ సమాచారాన్నీ దాచిపెట్టలేదని పేర్కొంటూ అదే రోజు సాయంత్రం ఐదు గంటల లోగా న్యాయస్థానానికి అఫిడవిట్‌ సమర్పించాలని ఆదేశించింది. ఎన్నికల బాండ్లకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో న్యాయమూర్తులు సంజీవ్‌ ఖన్నా, బీఆర్‌ గవారు, జేబీ పార్దివాలా, మనోజ్‌ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మరోసారి విచారణ జరిపి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
బాండ్లకు సంబంధించి ఎస్‌బీఐ తాను ఎంచుకున్న (సెలక్టివ్‌) సమాచారాన్ని మాత్రమే ఇస్తే సరిపోదని, వివరాలన్నీ అందించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎవరు, ఏ పార్టీకి, ఏ తేదీన, ఎంత విరాళం ఇచ్చారో యూనిక్‌ నెంబర్ల ద్వారా తెలుస్తుందని అంటూ వాటి వివరాలు ఇవ్వకపోతే ఎలా అని నిలదీసింది. యూనిక్‌ నెంబర్లు సహా పూర్తి వివరాలను ఎన్నికల కమిషన్‌కు ఇవ్వాలని, ఆ తర్వాత దానిని ధృవీకరిస్తూ ఈ నెల 21వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోగా న్యాయస్థానంలో అఫిడవిట్‌ సమర్పించాలని తేల్చి చెప్పింది. ఎస్‌బీఐ నుండి పూర్తి వివరాలు అందిన వెంటనే ఎన్నికల కమిషన్‌ తన వెబ్‌సైటులో వాటన్నింటినీ అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించింది.
‘2019 ఏప్రిల్‌ 12వ తేదీన మేము మధ్యంతర ఆదేశాలు జారీ చేశాము. ఆ రోజు నుండి జారీ చేసిన బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని మీకు స్పష్టం చేశాము. మధ్యంతర ఆదేశాలు జారీ చేసినప్పటి నుండి ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు పొందిన రాజకీయ పార్టీల వివరాలు కూడా ఈసీకి అందజేయాలని చెప్పాము. ఏ పార్టీ, ఏ తేదీన బాండును నగదుగా మార్చుకుంది? దాని విలువ ఎంత? అనే సమాచారాన్ని కూడా ఎస్‌బీఐ అందజేయాల్సి ఉంది. ఫిబ్రవరి 15వ తేదీన ఇచ్చిన తీర్పులో సైతం ఇదే విషయాన్ని స్పష్టంగా తెలియజేశాము, మరో మాటలో చెప్పాలంటే ఎస్‌బీఐ తన వద్ద ఉన్న వివరాలన్నింటినీ పూర్తిగా బహిర్గతం చేయాల్సిందే. అందులో సందేహమే లేదు’ అని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ‘మీ వద్ద ఉన్న సమాచారాన్నంతటినీ వెల్లడించాలని మేము కోరుకుంటున్నాము. మీరు ఇక్కడ ఏ రాజకీయ పార్టీ తరఫున హాజరు కాలేదని మేము భావిస్తున్నాము’ అని చురక వేసింది. ఎస్‌బీఐ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే ధర్మాసనం ఆదేశాలపై స్పందిస్తూ వివరాలు సమర్పించడానికి బ్యాంకుకు అభ్యంతరాలేమీ లేవని తెలియజేశారు. సాల్వే స్టేట్‌మెంటును న్యాయస్థానం నమోదు చేసుకుంది.

Spread the love