– పసుపు పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దివ్య
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని కొండా లక్ష్మణ్ ఉద్యానవన యూనివర్సిటీ, పసుపు పరిశోధన కేంద్రం ద్వారా ఈనెల 22వ తేదీన రైతులకు పసుపు నారును అందజేయనున్నట్లు పసుపు పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దివ్య శనివారం తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి పసుపు నారు మొక్కల్ని అందిస్తామని తెలిపారు.
నారు కావలసిన రైతులు ఆధార్ కార్డు జిరాక్స్, ఫోన్ నెంబర్ తీసుకొని పసుపు పరిశోధన కేంద్రానికి రావాలని సూచించారు. ఒక్క రైతుకు కేవలం 1000 మొక్కలు ఇవ్వడం జరుగుతుందని ఒక్క మొక్కకు రూ.2 చెల్లించవలసి ఉంటుందన్నారు.అల్లం మొక్కలు కూడా ఇవ్వడం జరుగుతుందని, ఒక్కో అల్లం మొక్కకు రూ.2 చెల్లించాలన్నారు. పసుపు పరిశోధన కేంద్రం ద్వారా ట్రాన్స్ పోర్టింగ్ సౌకర్యం లేదని, మొక్కల్ని తీసుకెళ్ళేందుకు రైతులే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కాగా పసుపు పరిశోధన కేంద్రం ద్వారా రైతులకు ఒక లక్ష, 5వేల 440 మొక్కల్ని అందించనున్నట్లు శాస్త్రవేత్త దివ్య తెలిపారు. ఇందులో దుగ్గిరాల ఎరుపు రకం 82వేల మొక్కలు, రాజేంద్ర సోనియా రకం 4వేల మొక్కలు, రాజపురి రకం 3వేల మొక్కలు, సలీమ్ రకం 3వేల మొక్కలు, అల్లం 13,440 మొక్కలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని పసుపు రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.



