– తిప్పర్తిలోని నార్కట్పల్లి- అద్దంకి హైవేపై రైతుల ఆందోళన
– కాంటాలు అయ్యాక రైతులు బాధ్యులుకారు : ఆర్డీఓ
నవతెలంగాణ- తిప్పర్తి
తాలు పేరుతో ధాన్యంలో కోత విధించొ ద్దంటూ నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో శనివారం నార్కట్పల్లి- అద్దంకి హైవేపై రైతులు రాస్తారోకో చేశారు. తిప్పర్తి పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రెండు, మూడ్రోజులుగా గన్నీ బ్యాగ్స్ లేక కాంటాలు జరగటం లేదని, అధికా రులు, మిల్లర్లు ఏకమై తాలు ఎక్కువగా ఉన్నదని ధాన్యంలో కోత విధిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో శేఖర్రెడ్డి, ఎమ్మార్వో రామకృష్ణ, ఎస్ఐ వి.శంకర్ ఘటనా స్థలానికి వచ్చి రైతులతో చర్చించారు. మిల్లర్లతో మాట్లాడి ధాన్యం దిగుమతి చేసే విధంగా చూస్తామని ఆర్డీఓ హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం ఆర్డీవో మిల్లర్లతో మాట్లా డారు. రైతులు ధాన్యం అమ్మిన తర్వాత మిల్లు దగ్గరికి రారని, ఒకవేళ రైతులను మిల్లుల దగ్గరకు పంపిస్తే సంబంధిత అధికారులే వారికి బాధ్యత వహించాలని హెచ్చరించారు. మిల్లర్లు కొనుగోలు కేంద్రానికే వచ్చి ధాన్యంలో తాలు శాతం ఎంత ఉందో యావరేజ్గా చూడాలని సూచించారు. గన్నీ బ్యాగ్స్ కూడా వెంటనే తెప్పించి కాంటాలు జరపాలని నిర్వాహకులను హెచ్చరించారు. రాస్తారోకోలో రైతు కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మన్నె బిక్షం, మాజీ జెడ్పీటీసీ తండు సైదులు గౌడ్, కంది దామోదర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
నెలరోజులైనా కాంటా పెట్టలేదు : గుండు సత్తయ్య, రైతు
నేను మార్కెట్లో వడ్లు పోసి నెల రోజులు కావొస్తోంది. మ్యాచర్ తీసి కూడా 15 రోజులు అవుతోంది. ఇప్పటివరకు కాంటా పెట్టలేదు. ఎనక పోసిన వాళ్లయి కాంటా అవుతున్నాయి. అడిగితే పెడతాంలే అంటున్నారు తప్ప కొనుగోలు చేయడం లేదు. నా ధాన్యం కుప్పలో తాలు లేకుండా తూర్పార పట్టాను.
ఇప్పటి వరకు ట్రక్షీట్ ఇవ్వలేదు : గోలి పెద్ద వెంకటరెడ్డి, రైతు, తిప్పలమ్మ గూడెం
నా ధాన్యం దిగుమతి అయి 15 రోజులు అవుతోంది. నాకు ఇప్పటివరకు ట్రక్షీట్ ఇవ్వలేదు. అడిగితే మిల్లు దగ్గర ఇంకా ఇవ్వలేదని నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు.
తాలు ఎక్కువగా వచ్చిందని రైతులను ఇబ్బందులు పెట్టొద్దు : మన్నె బిక్షం,
రైతు సంఘం జిల్లా కార్యదర్శి
నాసిరకం విత్తనాలు, పురుగు మందుల వల్ల ధాన్యంలో తాలు ఎక్కువగా వచ్చింది. దానికి రైతుని బాధ్యులను చేయొద్దు. ధాన్యంలో అధికారులు కోతలు విధిస్తే అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తాం.



