– మోడీని ప్రశ్నించిన ఏచూరి
న్యూఢిల్లీ : స్వామి వివేకానంద చికాగో ప్రసంగపు ముగింపు మాటలు ప్రధాని మోడీకి తెలుసా అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. తమ స్వంత మతమే ప్రత్యేకించి మనుగడ సాగించాలని కలలు కనే వారిని చూసి తాను జాలి పడతానని స్వామి వివేకానంద చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్టు పెట్టారు. 1893 సెప్టెంబరు 11-17 మధ్య చికాగోలో జరిగిన ప్రపంచ మతాల మహా సమ్మేళనంలో వివేకానంద చారిత్రక ప్రసంగం చేశారు. ప్రఖ్యాతి చెందిన ఆయన ప్రనంగంలోని ఒక కొటేషన్ను ఆ పోస్ట్లో ఏచూరి పంచుకున్నారు. ”తమ మతం ప్రత్యేకంగా మనుగడ సాగించాలని, ఇతరుల మతాలు నాశనమై పోవాలని ఎవరైనా కలలు కన్నట్లైతే నేను వారిని చూసి జాలి పడతా. ప్రతిఘటన ఎదురైనప్పటికీ ‘ఘర్షణ కాదు సాయపడాలి’, సమీకరణ కావాలి, విధ్వంసం కాదు, శాంతి సామరస్యతలు కావాలి, కలహాలు కాదు.” అని ప్రతి మతం బ్యానర్పై త్వరలో రాయబడుతుందని ఆ వ్యక్తికి చూపిస్తా” అని వివేకానంద ఆనాటి ప్రసంగంలో పేర్కొన్నారు.
ఇందులో లోక్సభ ఎన్నికల ప్రచారంలో మోడీ ఇతర బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, వివేదానందుడి స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయని విమర్శించారు.