నవతెలంగాణ – హైదరాబాద్ : తాను స్వరపరిచిన ప్రసిద్ధ గీతం ‘ఎన్ ఇనియా పొన్ నిలవే’ కాపీరైట్ వివాదంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ మేరకు ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. వివరాల్లోకి వెళితే..’మూడు పని’ చిత్రంలోని ‘ఎన్ ఇనియా పొన్ నిలవే’ పాటను ‘అఘాతీయా’ అనే మరొక సినిమాలో రీ-యూజ్ చేయడానికి ప్రయత్నించగా ‘సారెగామా ఇండియా’ సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు, ఇళయరాజాకు కేవలం పాటలోని సంగీత స్వరకల్పనపై మాత్రమే హక్కు ఉందని… సౌండ్ రికార్డింగ్, సాహిత్యంపై ఎలాంటి కాపీరైట్ లేదని స్పష్టం చేసింది. సౌండ్ రికార్డింగ్ హక్కులు మూల చిత్ర నిర్మాత నుంచి సారెగామా సంస్థకు బదిలీ అయ్యాయని హైకోర్టు పేర్కొంది.
అయితే, ఈ పాటకు స్వయంగా సంగీతాన్ని సమకూర్చినందున, ఆ స్వరాలను కొత్త రూపంలో ఉపయోగించేందుకు ఇతరులకు అనుమతి ఇచ్చే పూర్తి హక్కు తనకే ఉంటుందని ఇళయరాజా స్పష్టం చేస్తున్నారు. సంగీత కూర్పు, సాహిత్యం, సౌండ్ రికార్డింగ్లను వేర్వేరు అంశాలుగా విడదీస్తూ తన హక్కులను కేవలం సంగీతానికే పరిమితం చేస్తూ ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.



