నవతెలంగాణ – లక్నో: ఉత్తరప్రదేశ్లో భారీ ప్రమాదం జరిగింది. ఎల్పీజీ సిలిండర్ల లోడ్తో ఉన్న ఓ లారీ లక్నో నుంచి గోండాకు వెళ్తున్నది. ఈ క్రమంలో గోండా సరిహద్దులోకి చేరుకోగానే లారీలో మంటలు అంటుకున్నాయి. దీంతో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఒకదాని తర్వాత ఒక సిలిండర్ పేలిపోయింది. గ్యాస్ బండలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. పేలుడు ధాటికి లారీ పూర్తిగా ధ్వంసమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపుచేశారు. ముందుజాగ్రత్త చర్యగా ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి కిలోమీటరు వరకు ఇరువైపులో వాహనాలను నిలిపివేశారు. కాగా, ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామన్నారు.