నవతెలంగాణ-హైదరాబాద్: సెంట్రల్ కొలంబియాలోని సుటటౌసాలో ఒక బొగ్గు గనిలో జరిగిన పేలుడులో తొమ్మిది మంది కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారని అధికారులు సోమవారం ధృవీకరించారు. ఈ ఘటన సోమవారం జరిగింది. బొగ్గు గనిలో సుమారు 600 కిలోమీటర్ల లోతులో కార్మికులు తవ్వుతుండగా ఈ ఘటన జరిగింది. గనిలో మిథేన్ వాయువు, బొగ్గు ధూళి పేరుకుపోవడం వల్ల పేలుడు సంభవించిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. తక్షణమే రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఉబటే ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారని జాతీయ మైనింగ్ ఏజెన్సీ (ఎఎన్ఎం) వెల్లడించింది.
కాగా, గనిలో 15 మంది కార్మికుల్లో 9 మంది మృతి చెందారని, ఆ మృతదేహాలను ప్రత్యేక గనుల రక్షణ బృందం 9 మంది మృతదేహాలను వెలికితీశారు. మున్సిపల్ రిస్క్ మేనేజ్మెంట్ కౌన్సిల్ సమన్వయంతో కలిసి ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నట్లు ఈ బృందం కెప్టెన్ అల్వారో ఫర్ఫాన్ తెలిపారు. గనుల తవ్వకాలపై ఎఎన్ఎం ఏప్రిల్ 9వ తేదీనే కఠినమైన భద్రతా అవసరాలను జారీ చేసింది. ఆ అదేశాల్ని పాటించకుండా తవ్వకాలు జరిపినట్లు ఎఎన్ఎం తెలిపింది. గనుల తవ్వకానికి కారణమైన కార్బోనెరా లాస్ పినోస్ ఎస్.ఏ.ఎస్. కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు అధికారులు సానుభూతి తెలిపారు. ప్రాణాలతో బయటపడిన ఆరుగురిని జేవియర్ గార్నికా, హ్యూగో కైసెడో, అల్బెర్టో హోయోస్, జార్జ్ టార్డెలి, లూయిస్ కాస్టెల్లానోస్, విల్సన్ సర్మింటోలుగా గుర్తించారు.



