నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలంలో శనివారం అబ్కారి శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. అక్రమ మద్యం విక్రయాలు, మాదకద్రవ్యాల రవాణా, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అక్రమంగా మద్యం తరలింపునకు అడ్డుకట్ట వేసేందుకు మండల వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆబ్కారీ శాఖ జిల్లా అధికారి (ఈఎస్) ముకుంద రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు మద్నూర్ ఆబ్కారీ ఎస్.ఐ నాగేష్ తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని కల్లు దుకాణాలు, దాబా హోటళ్లు, రైస్ మిల్లుల గోదాముల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు.
కల్లు దుకాణాల్లో కల్లు నమూనాలను (శాంపిళ్లు) సేకరించి పరీక్షల కోసం పంపినట్లు ఆయన వెల్లడించారు. దాబా హోటళ్లలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్నారా అనే అంశంపై ఆరా తీశారు. అలాగే రైస్ మిల్లుల గోదాములను తనిఖీ చేసి మాదకద్రవ్యాలకు సంబంధించిన వస్తువులు లేదా ఇతర అనుమానాస్పద పదార్థాలు నిల్వ చేశారా అనే విషయాన్నిపరిశీలించినట్లుతెలిపారు.మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులోని ఆబ్కారీ చెక్పోస్ట్ వద్ద ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.అక్రమ మద్యం, మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఎక్సైజ్ ఎస్సై నాగేష్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఆబ్కారీ సిబ్బంది దేవిసింగ్, వెంకటేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.



