45 దేశాల నుంచి 11 వేల మంది అథ్లెట్లు సై
2026 ఆసియా క్రీడలు నేటి నుంచి
నగోయా (జపాన్) : అతిపెద్ద క్రీడా సంగ్రామానికి రంగం సిద్ధమైంది. ఒలింపిక్స్ కంటే ఎక్కువ మంది క్రీడాకారులు పోటీపడే ఆసియా క్రీడలు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. 20వ ఆసియా గేమ్స్కు జపాన్లోని నగోయా నగరం ముస్తామైంది. నేడు ఆరంభ వేడుకలతో ఆసియా క్రీడలు షురూ కానుండగా.. 45 దేశాల నుంచి 43 క్రీడాంశాల్లో సుమారు 11 వేల మంది క్రీడాకారులు పోటీపడనున్నారు. టీమ్ ఇండియా జంబో బృందంతో నగోయ నగరంలోకి కాలుమోపింది. 501 మంది క్రీడాకారులు భారత్ తరఫున ఆసియా క్రీడల్లో పతక వేట సాగించనున్నారు. 2022 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత్ రికార్డు 106 పతకాలు సాధించింది. 2026 నగోయ ఆసియా గేమ్స్లో ఆ రికార్డును అధిగమించాలనే లక్ష్యంతో టీమ్ ఇండియా జపాన్లో అడుగుపెట్టింది.
ఆ రెండింటిపైనే ఆశలు!
అథ్లెటిక్స్, షూటింగ్ విభాగాల్లో భారత్ ఎక్కువగా పతకాలు ఆశిస్తోంది. స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గాయంతో దూరమైనా.. ట్రాక్ అండ్ ఫీల్డ్లో పతక రేసులో దండిగానే నిలిచారు. తజిందర్పాల్ సింగ్ తూర్, మురళీ శ్రీశంకర్ (లాంగ్ జంప్), గుల్వీర్ సింగ్ (డిస్టెన్స్ రన్), రోహిత్ యాదవ్ (జావెలిన్), తేజస్విన్ శంకర్ (డెకాథ్లాన్), యర్రాజి జ్యోతి (100 మీటర్ల హర్డిల్స్), ప్రవీణ్ చిత్రవేల్ (ట్రిపుల్ జంప్) పసిడిపై కన్నేశారు. షూటింగ్లో మను భాకర్, తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నారు. 30 మంది షూటర్లు పలు విభాగాల్లో పతకాలపై గురి పెట్టారు. క్రికెట్, హాకీతో పాటు బ్యాడ్మింటన్లోనూ పతక అంచనాలు భారీగా ఉన్నాయి. పి.వి సింధు, సాత్విక్-చిరాగ్ జోడీలు మెడల్స్పై గురి పెట్టారు. బాక్సింగ్, ఆర్చరీ, కబడ్డీల్లోనూ భారత్ పసడి పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. నేడు ఆసియా క్రీడల ఆరంభ వేడుకల్లో భారత పతాకధారులుగా ఒలింపిక్స్ స్టార్ మను భాకర్, అథ్లెట్ తజిందర్ సింగ్ పాల్లు వ్యవహరించనున్నారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు పలోమా మిజుహో స్టేడియంలో ఓపెనింగ్ సెర్మానీ షురూ కానుంది.



