ఆసియా కప్‌ చాంపియన్‌గా భారత్‌

India as Asia Cup champion– మహ్మద్‌ సిరాజ్‌ వికెట్ల సిక్సర్‌
– 50 పరుగులకు కుప్పకూలిన శ్రీలంక
మియాభారు మిన్నంటే ప్రదర్శన. హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (6/21) కొలంబోలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రేమదాస పిచ్‌పై కండ్లుచెదిరే స్వింగ్‌ రాబట్టిన సిరాజ్‌ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లతో శ్రీలంక టాప్‌ ఆర్డర్‌ను కకావికలం చేయటంతో పాటు పది బంతుల వ్యవధిలో ఐదు వికెట్లు పడగొట్టి డిఫెండింగ్‌ చాంపియన్‌ను దిక్కుతోచని స్థితిలోకి తీసుకెళ్లాడు. హార్దిక్‌ పాండ్య (3/3), బుమ్రా (1/23) సైతం నిప్పులు చెరగగా.. శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలింది. అతి స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన టీమ్‌ ఇండియా రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి ఆసియా కప్‌ చాంపియన్స్‌గా నిలిచింది.
నవతెలంగాణ-కొలంబో
భారత్‌ అష్టపది. రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి ఆసియా కప్‌ విజేతగా అవతరించింది టీమ్‌ ఇండియా. ఆదివారం కొలంబోలోని ఆర్‌.ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఆసియా కప్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో అత్యంత ఏకపక్ష విజయం సాధించింది. 51 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని 6.1 ఓవర్లలోనే ఛేదించిన టీమ్‌ ఇండియా..మరో 263 బంతులు మిగిలి ఉండగానే ఎనిమిదో ఆసియా కప్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. యువ ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌ (27 నాటౌట్‌, 19 బంతుల్లో 6 ఫోర్లు), ఇషాన్‌ కిషన్‌ (23 నాటౌట్‌, 18 బంతుల్లో 3 ఫోర్లు) అజేయ భాగస్వామ్యంతో శ్రీలంకపై చెలరేగారు. అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన డిఫెండింగ్‌ చాంపియన్‌ శ్రీలంకపై మహ్మద్‌ సిరాజ్‌ (6/21) విరుచుకుపడ్డాడు. పది బంతుల వ్యవధిలో ఐదు వికెట్లు పడగొట్టిన సిరాజ్‌కు హార్దిక్‌ పాండ్య, బుమ్రా తోడటంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్‌ మెండిస్‌ (17), దుశాన్‌ హేమంత (13 నాటౌట్‌) రెండెంకల స్కోరు అందుకున్నారు. ఆరు వికెట్ల మొనగాడు మహ్మద్‌ సిరాజ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.
ఓపెనర్లే ఊదేశారు : 51 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని ఓపెనర్లే ఊదేశారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్‌ కిషన్‌.. శుభ్‌మన్‌ గిల్‌ తోడుగా పవర్‌ప్లేలో పవర్‌ఫుల్‌గా ఆడాడు. వికెట్‌కు ఇరువైపులా గిల్‌, కిషన్‌లు బౌండరీలు బాదటంతో శ్రీలంక చేష్టలుడిగింది. గిల్‌ ఆరు బౌండరీలతో దండెత్తగా.. ఇషాన్‌ కిషన్‌ సైతం మూడు బౌండరీలతో విరుచుకుపడ్డాడు. యువ ఓపెనర్ల ధనాధన్‌తో 6.1 ఓవర్లలో టీమ్‌ ఇండియా లాంఛనం ముగించింది. 10 వికెట్ల తేడాతో అత్యంత ఏకపక్ష విజయం నమోదు చేసింది.
సిరాజ్‌ విశ్వరూపం : టాస్‌ నెగ్గిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఫైనల్లో బంతితో వేట షురూ చేసిన టీమ్‌ ఇండియా.. ఇన్నింగ్స్‌ ఆరంభ ఓవర్లోనే బ్రేక్‌ సాధించింది. పేస్‌ దళపతి బుమ్రా ఇన్నింగ్స్‌ మూడో బంతికే ఓపెనర్‌ కుశాల్‌ పెరీరా (0)ను సాగనంపాడు. బుమ్రా బంతి అవుట్‌సైడ్‌ ఎడ్జ్‌ కావటంతో పెరీరా వికెట్‌ కీపర్‌కు చిక్కాడు. బుమ్రా వికెట్ల పతనానికి దారి చూపగా.. మహ్మద్‌ సిరాజ్‌ అసలు సంగతి చూసుకున్నాడు. తన రెండో ఓవర్లోనే సిరాజ్‌ అసమాన ప్రదర్శన చేశాడు. ఇన్నింగ్స్‌ నాల్గో ఓవర్లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. నిశాంక (2), సమరవిక్రమ (0), చరిత్‌ అసలంక (0), ధనంజయ డిసిల్వ (4)లు సిరాజ్‌కు స్వింగ్‌కు దాసోహం అయిపోయారు. సిరాజ్‌ దెబ్బకు శ్రీలంక నాలుగు ఓవర్లలో 12 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. తన తర్వాతి ఓవర్లో శ్రీలంక కెప్టెన్‌ దసున్‌ శనక (0)ను సైతం వెనక్కి పంపిన సిరాజ్‌.. శ్రీలంకను నిసహాయ స్థితిలోకి నెట్టాడు. టాప్‌ ఆర్డర్‌లో కుశాల్‌ మెండిస్‌ (17), లోయర్‌ ఆర్డర్‌లో హేమంత (13 నాటౌట్‌) రెండెంకల స్కోరుతో శ్రీలంక 50 పరుగుల మార్క్‌ తాకింది. హార్దిక్‌ పాండ్య సైతం స్వింగ్‌ రాబట్టి.. శ్రీలంక లోయర్‌ ఆర్డర్‌ ఖేల్‌ ఖతం చేశాడు. దునిత్‌ వెల్లలాగే (8), ప్రమోద్‌ మధుశన్‌ (1), మతీశ పతిరణ (0)లు హార్దిక్‌ పాండ్య బంతికి వికెట్లు కోల్పోయారు. 92 బంతుల్లో 50 పరుగులు చేసిన శ్రీలంక.. భారత్‌తో వన్డేల్లో అత్యల్ప స్కోరుకు కుప్పకూలింది.
స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్‌ : నిశాంక (సి) జడేజా (బి) సిరాజ్‌ 2, కుశాల్‌ పెరీరా (సి) రాహుల్‌ (బి) బుమ్రా 0, కుశాల్‌ మెండిస్‌ (బి) సిరాజ్‌ 17, సమరవిక్రమ (ఎల్బీ) సిరాజ్‌ 0, చరిత్‌ అసలంక (సి) కిషన్‌ (బి) సిరాజ్‌ 0, ధనంజయ డిసిల్వ (సి) రాహుల్‌ (బి) సిరాజ్‌ 4, దుసున్‌ శనక (బి) సిరాజ్‌ 0, దునిత్‌ వెల్లలాగే (సి) రాహుల్‌ (బి) పాండ్య 8, హేమంత నాటౌట్‌ 13, ప్రమోద్‌ మధుశన్‌ (సి) కోహ్లి (బి) పాండ్య 1, మతీశ పతిరణ (సి) కిషన్‌ (బి) పాండ్య 0, ఎక్స్‌ట్రాలు :5,
మొత్తం : (15.2 ఓవర్లలో ఆలౌట్‌) 50.
వికెట్ల పతనం : 1-1, 2-8, 3-8, 4-8, 5-12, 6-12, 7-33, 8-40, 9-50, 10-50.
బౌలింగ్‌ : జశ్‌ప్రీత్‌ బుమ్రా 5-1-23-1, మహ్మద్‌ సిరాజ్‌ 7-1-21-6, హార్దిక్‌ పాండ్య 2.2-0-3-3, కుల్దీప్‌ యాదవ్‌ 1-0-1-0.
భారత్‌ ఇన్నింగ్స్‌ : ఇషాన్‌ కిషన్‌ నాటౌట్‌ 23, శుభ్‌మన్‌ గిల్‌ నాటౌట్‌ 27, ఎక్స్‌ట్రాలు :1, మొత్తం : (6.1 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 51.
బౌలింగ్‌ : ప్రమోద్‌ మధుశన్‌ 2-0-21-0, మతీశ పతిరణ 2-0-21-0, దునిత్‌ వెల్లలాగే 2-0-7-0, చరిత్‌ అసలంక 0.1-0-1-0. మహ్మద్‌ సిరాజ్‌ ఏడు ఓవర్లలో 21 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టి కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేశాడు. 2022 నుంచి వన్డేల్లో పవర్‌ప్లేలో 32 వికెట్లు పడగొట్టిన మహ్మద్‌ సిరాజ్‌.. ఈ సమయంలో కొత్త బంతితో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్‌ టైటిల్‌ వేటకు సిద్ధమవుతున్న టీమ్‌ ఇండియాకు కొత్త బంతితో మహ్మద్‌ సిరాజ్‌ సంచలన ప్రదర్శనలు సరికొత్త ఉత్సాహం అందిస్తున్నాయి.

Spread the love