నవతెలంగాణ – హైదరాబాద్ : సర్వోన్నత న్యాయస్థానానికి ఐదుగురు కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. నలుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఒక సీనియర్ న్యాయవాదిని సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించాలంటూ కొలీజియం చేసిన సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆమోదముద్ర వేసింది. ఈ నియామకాలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(2) ప్రకారం ఈ నియామకాలు జరిగాయని ఆయన తన పోస్ట్లో పేర్కొన్నారు.
మే 22, 27 తేదీల్లో జరిగిన సమావేశాల్లో సుప్రీంకోర్టు కొలీజియం ఈ ఐదుగురి పేర్లను పదోన్నతి కోసం కేంద్రానికి సిఫార్సు చేసింది. కొత్తగా నియమితులైన వారిలో పంజాబ్, హరియాణా హైకోర్టు చీఫ్ జస్టిస్ షీల్ నాగు, బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జమ్మూకశ్మీర్, లడఖ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అరుణ్ పల్లి ఉన్నారు. వీరితో పాటు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ వి. మోహనను కూడా నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించారు.



