నవతెలంగాణ – హైదరాబాద్ : భారత మాజీ పేసర్ ఎస్. శ్రీశాంత్, టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2023 డిసెంబర్లో లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా తమ మధ్య జరిగిన వాగ్వాదంలో గంభీర్ తనను ‘ఫిక్సర్’ అని దూషించాడని గతంలో వెల్లడించిన శ్రీశాంత్, ఇప్పుడు మరిన్ని వివరాలు బయటపెట్టాడు. ఆ గొడవలో గంభీర్ తనను ‘దేశద్రోహి’ అని కూడా తిట్టాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆరోపించాడు. గంభీర్ ప్రస్తుతం భారత జట్టుకు హెడ్ కోచ్గా ఉన్న తరుణంలో ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఒ ఇంటర్వ్యూలో శ్రీశాంత్ ఆ ఘటనను వివరిస్తూ.. “నేను గంభీర్కు బౌన్సర్ వేశాను. తొలి బంతికే స్టెప్-అవుట్ అయి ఫ్లిక్ చేశాడు. ఎందుకంటే నా ఆట గురించి అతనికి బాగా తెలుసు. అతను చాలా మంచి క్రికెటర్. కోచింగ్ గురించి నాకు తెలియదు కానీ, ఆటగాడిగా అతను అద్భుతం. నేను బౌన్సర్ వేయగానే, గంభీర్ నా దగ్గరకు వచ్చి దుర్భాషలాడాడు. అతను అనకూడని మాటలు అన్నాడు. నన్ను ‘ఫిక్సర్’ అని పిలిచాడు” అని శ్రీశాంత్ తెలిపాడు.
“నేను అతని వైపు వంగి, ‘గౌతీ భాయ్, అంతా ఓకేనా?’ అని అడిగాను. నేను భారీ కాయంతో ఉండటంతో కొడతానని అతను భావించినట్లున్నాడు. వెంటనే అతను తిట్ల పురాణం అందుకున్నాడు. మళ్లీ మళ్లీ ‘ఫిక్సర్’, ‘దేశద్రోహి’ అని దూషించాడు” అంటూ శ్రీశాంత్ సంచలన ఆరోపణలు చేశాడు. తాను బౌన్సర్ వేసినందుకే గంభీర్ అలా రెచ్చిపోయాడని వివరించాడు.



