నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్ కవ్రేపలాంచోక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బనేపా నుంచి రోషి గ్రామీణ మున్సిపాలిటీ వైపు వెళ్తున్న ప్రయాణికుల బస్సు నమోబుద్ధ మున్సిపాలిటీ పరిధిలోని సెల్ఫీ డాండా ప్రాంతంలో అదుపుతప్పి సుమారు 300 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది.ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయాలు కాగా.. వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న వెంటనే.. నేపాల్ సైన్యం, పోలీసులు, సాయుధ పోలీసు బలగాలు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. లోయలో పడిపోయిన బస్సు నుంచి క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
జిల్లా పోలీసు కార్యాలయం వివరాల ప్రకారం.. ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కొందరిని గుర్తించగా.. మరికొందరి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గాయపడిన 16 మందిని ధులిఖేల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.



