నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని తాజ్ పూర్ గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం వద్ద మండల వైద్యాధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక హెచ్ పీవి వ్యాక్సిన్ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ రాక్యల సంతోష శ్రీనివాస్ హాజరై, మాట్లాడారు. 14, 15 సంవత్సరాలలోపు కిషోర బాలికలకు హెచ్ పి వి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందనారు. అమ్మాయిలు హెచ్ పి వి వైరస్ బారిన పడి భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి ఈ హెచ్ పీవి వ్యాక్సిన్ లు తీసుకోవాలని సూచించారు.
భవిష్యత్తులో ఆరోగ్య వంతమైన జీవితానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలో తాజ్ పూర్ గ్రామ బాలికలకు దాదాపు 15 మందికి స్వంత రవాణా ఖర్చులతో భువనగిరి ఏరియా ఆస్పత్రిలో ఈ హెచ్ పి వి వ్యాక్సిన్ లు ఇప్పించామని గుర్తు చేసారు. తల్లిదండ్రులు పూర్తి అవగాహనతో వారి ఆడపిల్లలకు సూచించిన వయసు పరిమితి లోపు ఈ వ్యాక్సిన్ లు ఇప్పించాలని, మీ పిల్లల ఆరోగ్య వంతమైన జీవితానికి మీ సహకారం ఎంతో అవసరమని గౌరవ సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో సామాజిక వేత్త డా, ర్యాకల శ్రీనివాస్, వైద్యాధికారులు కుంటా సురేష్, వైద్య బృందం, ఆశ కార్యకర్త బింగి అరుణ, బాలికలు పాల్గొన్నారు.



