– ఆ పెండ్లిండ్లు కులనిర్మూలనకు మార్గాలు : ఎస్వీకే కార్యదర్శి ఎస్ వినయ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కుల మతాంతర వివాహాలు కుల నిర్మూలనకు బాటలు వేస్తాయనీ, ప్రభుత్వాలు, పౌర సమాజం సామాజిక బాధ్యతతో ఆదర్శ వివాహాలను ప్రోత్సహించాలని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ కార్యదర్శి ఎస్ వినయ కుమార్ అన్నారు. సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేవీపీఎస్, అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కవిత, వెంకటేష్ల ఆదర్శ వివాహాన్ని నిర్వహించారు. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు డాక్టర్ ఎన్ సిద్ధోజీరావు అధ్యక్షత వహించగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు ప్రమాణ పత్రాలు చదివించి, పూలదండలు మార్పించి వివాహ కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వినరు కుమార్ మాట్లాడుతూ మన దేశంలో కుల మతాంతర వివాహాలు పెద్ద సంఖ్యలో జరగాలన్నారు. రాజ్యాంగం నిర్దేశించిన కులనిర్మూలనలో కులాంతర వివాహలు ఒక భాగమని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లల అభీష్టాలను గౌరవించాలని చెప్పారు. సాంప్రదాయా లు, ఆచారాల పేరుతో పిల్లల జీవితాలతో చేలాగాటమాడొద్దని కోరారు. ఇదే సమయంలో క్షణికావేశాల ప్రేమల వల్ల జరిగే అనర్ధాల కంటే ఒకరినొకరు అర్థం చేసుకుని జీవిత భాగస్వాములు కావటం శుభసూచకమని చెప్పారు. లతా రాజా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ అంబేద్కరిస్ట్ డాక్టర్ కేకే రాజా,పిఎస్ఎన్ మూర్తి, బొజ్జా బిక్షమయ్య, కె. సుజావతి ,ఎం జగ్గరాజు, భూపతి వెంకటేశ్వర్లు తెలంగాణ రైతు సంఘం, గిరిజన సంఘం, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శిలు టీ సాగర్, ఆర్ శ్రీరాం నాయక్ అనగంటి వెంకటేష్ ఎం డి జావీద్ పాల్గొన్నారు.