– సీతారాముల కల్యాణోత్సవంలో కేటీఆర్
నవతెలంగాణ – కూకట్పల్లి
దేవాలయం బాగుంటే ఊరు బాగుంటుందని, ఊరు బాగుంటేనే దేశం బాగుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లిలోని ప్రముఖ, ప్రాచీన రామాలయంలో బుధవారం జరిగిన సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో కేటీఆర్ పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 439 ఏండ్ల చరిత్ర గల ఈ రామాలయాన్ని ఇంత అత్యద్భుతంగా గ్రామస్తుల సహకారంతో పున:నిర్మించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును అభినందిస్తున్నట్టు తెలిపారు. దేవాలయాలను కాపాడుకుని భావితరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శంభీపూర్ రాజు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.