కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలు అమలు

 – నల్లగొండ అభివృద్దే నా ధ్యేయం
– సిద్దిపేట,సిరిసిల్లను మించి అభివృద్ధి చేస్తా
– బిఆర్ఎస్ హామీలకు మళ్ళీ మోసపోవద్దు
– కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
– మహిళలతో కలిసి కోలాటం ఆడిన కోమటిరెడ్డి
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.శనివారం నల్గొండ పట్టణంలోని 18, 19, 42 వార్డులలో స్థానిక కౌన్సిలర్లు,  నాయకులతో కలిసి కోమటిరెడ్డి   విస్తృత ప్రచారం నిర్వహించారు.కాలనీలలో కోలాటాలతో పార్టీ శ్రేణులు, ప్రజలు కోమటిరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 18 వార్డు అమూల్య కాలనీలో మహిళతో కలిసి కోమటిరెడ్డి కోలాటం ఆడారు. అనంతరం గడపగడపకు వెళ్లి తనను గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఈసారి ఆరు గ్యారంటీ  స్కీములతో పాటు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను తన మేనిఫెస్టోలో పెట్టిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు పేద ప్రజలకు వరమని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వీటన్నింటిని కచ్చితంగా అమలు చేసి తీరుతామని అన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బిఆర్ఎస్ పార్టీ మోసపూరిత హామీలను ప్రజలు నమ్మవద్దని కోరారు. గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఎన్నికల ముందు మరోసారి ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ దత్తత పేరుతో నలగొండ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించాడని అన్నారు. ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదని ధ్వజమెత్తారు.సీఎం కేసీఆర్ మళ్ళీ వచ్చి మోసపూరిత హామీలతో పట్టణ ప్రజలను మోసం చేయాలని చూస్తాడని, ఈసారి మళ్లీ మోసపోతే గోసపడతామని అన్నారు.
బిఆర్ఎస్ పార్టీ మోసపూరిత హామీలను తిప్పి కొట్టాలన్నారు. తన హయాంలోనే నల్గొండ నియోజకవర్గ అభివృద్ధి చెందిందని అన్నారు.బిఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చెందలేదని పేర్కొన్నారు. ప్రజలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు లేవని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఏ స్థాయిలో ఉన్న తనకు రాజకీయ జన్మనిచ్చిన నల్లగొండను మర్చిపోనని అన్నారు. గతంలో మిగిలిన పనులను తోపాటు ఆరు గ్యారంటీ స్కీములను కచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని అన్నారు. సిద్దిపేట,సిరిసిల్లను మించి అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, 18 వ వార్డు కౌన్సిలర్ గడిగ హిమబిందు శ్రీనివాస్, 19 వార్డు కౌన్సిలర్ గణేష్, సూరెడ్డి సరస్వతి, ఏడు దొడ్ల వెంకటరామిరెడ్డి, నాగమణి, పాశం నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love