– 50 శాతం రాయితీతో విత్తనాల పంపిణీ
– ఏడీఏ పెంటేల రవికుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
రాబోయే వానాకాలం 2026 సీజన్లో రైతులు తమ పొలాల్లో పచ్చిరొట్ట పైర్లు సాగు చేసి నేల సారాన్ని, సేంద్రియ పదార్థాన్ని పెంపొందించుకోవాలని ఏడీఏ పెంటేల రవికుమార్ సూచించారు. జీలుగ, జనుము వంటి పచ్చిరొట్ట పైర్లు సాగు చేసి 40 నుంచి 45 రోజుల అనంతరం వాటిని నేలలో కలియదున్నితే నేలలో పోషకాల లభ్యత పెరగడంతో పాటు సేంద్రియ కర్బనం కూడా అధికమవుతుందని తెలిపారు.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు 50 శాతం రాయితీపై పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అశ్వారావుపేట డివిజన్లోని అన్నపురెడ్డిపల్లి మండలం పెద్దిరెడ్డిగూడెం రైతు వేదికలో సొసైటీ చైర్మన్ సుధాకర్రావు జీలుగ విత్తనాల పంపిణీని మంగళవారం ప్రారంభించారు. రైతులు తమ సాగుభూమి వివరాల ఆధారంగా ఏఈఓ ల వద్ద విత్తన పర్మిట్ పొందిన తర్వాత సొసైటీ సేల్ పాయింట్లో రైతు వాటా చెల్లించి విత్తనాలు తీసుకోవచ్చని తెలిపారు.
మండలాల వారీగా అందుబాటులో ఉన్న విత్తనాలు (క్వింటాళ్లలో):
అశ్వారావుపేట : జీలుగ 150, జనుము 100
అన్నపురెడ్డిపల్లి : జీలుగ 250
చంద్రుగొండ : జీలుగ 200
దమ్మపేట : జీలుగ 550, జనుము 120
ములకలపల్లి : జీలుగ 190



