నాలుగో టెస్టులో భార‌త్ అద్భుత విజ‌యం

నవతెలంగాణ – రాంచీ:  రాంచీలో జ‌రిగిన నాలుగో టెస్టులో భార‌త జ‌ట్టు అద్భుత విజ‌యం సాధించింది. అన్ని విభాగాల్లో ర‌ఫ్ఫాడించిన టీమిండియా హ్యాట్రిక్ విజ‌యంతో సిరీస్ కైవ‌సం చేసుకుంది. ఇంగ్లండ్ యువ స్పిన్న‌ర్లు టామ్ హ‌ర్ట్లే, షోయ‌బ్ బ‌షీర్‌లు హ‌డలెత్తించినా.. శుభ్‌మ‌న్ గిల్‌(52 నాటౌట్) హాఫ్ సెంచ‌రీతో అదుకున్నాడు. మ‌రోసారి ఆప‌ద్భాంద‌వుడి అవ‌తార‌మెత్తిన‌ ధ్రువ్ జురెల్‌(39 నాటౌట్) స‌మ‌యోచిత బ్యాటింగ్‌తో రోహిత్ సేన‌ 5 వికెట్ల తేడాతో విజ‌య ఢంకా మోగించింది. భార‌త జ‌ట్టు విజ‌యానికి ఇంకా 63 ప‌రుగులు కావాల్సిన ద‌శ‌లో క్రీజులోకి వ‌చ్చిన జురెల్ మ‌రోసారి కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచ‌రీతో జ‌ట్టును ఒడ్డున ప‌డేసిన అత‌డు గిల్‌తో కలిసి ఆరో వికెట్‌కు 72 ప‌రుగులు జోడించాడు. బ‌షీర్ బౌలింగ్‌లో ఫోర్, రెండు ర‌న్స్ తీసిన జురెల్ టీమిండియాకు చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యం అందించాడు. దాంతో, ప‌న్నెండేండ్ల క్రింత 2-1తో సిరీస్ నెగ్గిన ఇంగ్లండ్‌పై రోహిత్ సేన ప్ర‌తీకారం తీర్చుకుంది. ఓవ‌ర్ నైట్ స్కోర్ 40తో నాలుగో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భార‌త్ అనూహ్యంగా త‌డ‌బ‌డింది. బంతి ట‌ర్న్ కావ‌డంతో బ‌షీర్, హ‌ర్ట్లేల ధాటికి 16 ప‌రుగుల వ్య‌వ‌ధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. 84 ప‌రుగుల వ‌ద్ద య‌శ‌స్వీ జైస్వాల్(37 44 బంతుల్లో) వెనుదిర‌గ‌గా.. ఫిఫ్టీ బాదిన‌ రోహిత్ శ‌ర్మ‌(55 81బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స‌ర్) హ‌ర్ట్లే బౌలింగ్‌లో ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన ర‌జ‌త్ పాటిదార్(0) డ‌కౌట్ కావ‌డంతో 100 ప‌రుగుల‌కే మూడు శ‌లో జ‌డేజా, గిల్‌లు నాలుగో వికెట్‌కు 71బంతుల్లో 20 ర‌న్స్ జోడించ‌డంతో 118/3 తో లంచ్‌కు వెళ్లిన భార‌త జ‌ట్టు.. ఆ త‌ర్వాత రెండో ఓవ‌ర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో రోహిత్ సేన‌ను కూల్చిన బ‌షీర్ వ‌రుస బంతుల్లో ర‌వీంద్ర జ‌డేజా(5), స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌(0)ల‌ను ఔట్ చేశాడు. అత‌డి స్పిన్ మాయ‌తో రోహిత్ సేన 84/0 నుంచి 120/5 కు ప‌డిపోయింది. దాంతో, భార‌త డ్రెస్సింగ్ రూమ్‌తో పాటు స్టేడియంలోని అభిమానుల్లో ఒకింత నిరాశ క‌నిపించినా.. జురెల్ ఉన్నాడులే అన్న న‌మ్మ‌కం విజ‌యంపై భ‌రోసానిచ్చింది.
టీమిండియా ఐదు వికెట్లు కోల్పోవ‌డంతో ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ ఇద్ద‌రు స్పిన్న‌ర్ల‌తో అటాక్ చేయించాడు. దాంతో, బౌండ‌రీలు రావడ‌మే గ‌గ‌న‌మైంది. బ‌షీర్ బౌలింగ్‌లో జురెల్ బౌండ‌రీ కొట్టడంతో 31 ఓవ‌ర్ల త‌ర్వాత తొలి సారి బంతి బౌండ‌రీ దాటింది. ఆ త‌ర్వాత కూడా ఇద్ద‌రూ ఆచితూచి ఆడారు. భారీ షాట్ల‌కు వెళ్ల‌కుండా సింగిల్స్, డ‌బుల్స్‌తో స్కోర్ బోర్డును ప‌రుగెత్తించారు. ఈ జోడీని విడ‌దీసేందుకు స్టోక్స్ బౌల‌ర్ల‌ను మార్చినా ఫ‌లితం లేక‌పోయింది. స‌హ‌జ ఆట‌కు విరుద్దంగా ఓపిక‌గా ఆడిన గిల్.. బ‌షీర్ బౌలింగ్‌లో రెండు సిక్స‌ర్ల‌తో ఫిఫ్టీ సాధించాడు. దాంతో, టీమిండియా ల‌క్ష్యానికి 6 ప‌రుగుల దూరంలో నిలిచిందంటే. అక్క‌డితో గెలుపుపై ఏదో మూల‌న ఉన్న ఇంగ్లండ్ ఆశ‌లు ఆవిర‌య్యాయి. తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్ సెంచ‌రీతో 353 ర‌న్స్ కొట్టిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్‌లో త‌డ‌బ‌డింది. అశ్విన్, కుల్దీప్ యాద‌వ్ తిప్పేయ‌డంతో మూడో రోజు 145 ప‌రుగుల‌కే ఆలౌట‌య్యింది. స్టోక్స్ సేన నిర్దేశించిన‌ 192 ప‌రుగుల ఛేద‌న‌లో ఓపెన‌ర్లు య‌శ‌స్వీ, రోహిత్ ధ‌నాధ‌న్ ఆడారు. దాంతో, మూడో రోజు ఆట ముగిసే స‌రికి భార‌త్ వికెట్ కోల్పోకుండా 40 ర‌న్స్ కొట్టింది. గిల్, జురెల్ పోరాటంతో చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యం సాధించిన భార‌త జ‌ట్టు 3-1తో సిరీస్ కైవ‌సం చేసుకుంది. ఇరుజ‌ట్ల మ‌ధ్య‌ నామ‌మాత్ర‌మైన ఐదో టెస్టు మార్చి 7 నుంచి రాజ్‌కోట్‌లో జ‌రుగ‌నుంది.

Spread the love