సిద్ధాపూర్ జీవోను ఉపసంహరించుకోవాలి
లేదంటే బాధితుల పక్షాన ఉద్యమం : మాజీమంత్రి హరీశ్రావు హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్లో డంప్ యార్డు ఏర్పాటు నిర్ణయంతో స్థానిక రైతులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్రావు అన్నారు. ఐటీ పార్క్ నిర్మించాల్సిన ప్రాంతంలో డంప్యార్డు పెట్టడం సరైంది కాదని చెప్పారు. సిద్దాపూర్లో డంప్ యార్డు జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే బాధితుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్లో బాధిత రైతులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హరీశ్రావును కలిసి వినతిపత్రం అందజేశారు. డంప్ యార్డు వల్ల వారు ఏ విధంగా నష్టపోతున్నారో వివరించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడాలనీ, న్యాయం జరిగేలా చూడాలని వారు ఆయన్ను కోరారు. రైతుల వినతిపై స్పందించిన హరీశ్రావు మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. సిద్దాపూర్ గ్రామంలో 86 ఎకరాల్లో డంప్ యార్డు ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 641 తీసుకురావడం అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. పచ్చని వ్యవసాయ భూముల మధ్య, జనావాసాలకు సమీపంలో డంప్ యార్డు ఏర్పాటు చేయాలనుకోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనమని అన్నారు. ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. సిద్దాపూర్తోపాటు చుట్టుపక్కల ఉన్న దాదాపు 20 గ్రామాలు ఈ డంప్ యార్డు వల్ల తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గ్రామాల ప్రజలంతా పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ నగరానికి అవసరమైన కూరగాయలను సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారని వివరించారు. డంప్ యార్డు ఏర్పాటు చేయాలనుకుంటున్న స్థలానికి ఆనుకుని ఉన్న ‘గుట్ట చెరువు’ నీటితోనే ఈ ప్రాంత రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు ఆ చెరువు పక్కనే డంప్ యార్డు పెడితే ఆ నీరు పూర్తిగా కలుషితమై, సాగు నీటితోపాటు తాగునీటికీ తీవ్ర ముప్పు వాటిల్లుతుందని అన్నారు. ఎంతో ప్రసిద్ధి చెందిన జహంగీర్ పీర్ (జేపీ) దర్గా కూడా ఇక్కడే ఉండటంతో, ఆ కాలుష్యం స్థానికులతోపాటు భక్తులకు కూడా శాపంగా మారడం ఖాయమని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇదే ప్రాంతంలో, డంప్ యార్డుకు కేటాయించిన సర్వే నెంబర్లు 252, 278, 361లో ఉన్న 334 ఎకరాల్లో ఐటీ పార్క్ నిర్మించాలని తాము ప్రణాళికలు రూపొందించామని గుర్తు చేశారు.
అక్కడ ఐటీ పార్క్ వస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని సంకల్పించామని అన్నారు. ఉపాధి కల్పించాల్సిన భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం డంప్ యార్డు ఏర్పాటు చేసి స్థానిక ప్రజల బతుకులను చిదిమేయాలని చూడటం శోచనీయమని విమర్శించారు. యువత కు అవకాశాలు కల్పించాల్సిన చోట కాలుష్యాన్ని, రోగాలను ఇవ్వడమే ప్రజా పాలనా?అని ప్రశ్నించారు. ప్రభుత్వం డంప్ యార్డులను ఏర్పాటు చేయాల నుకుంటే ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగని చోట, జనావాసాలు, గ్రామాలు లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. ఇలా పచ్చని పల్లెలను, పొలాలను, రైతులను ఆగమాగం చేయడం ఏమాత్రం తగదని హెచ్చరించారు.
ఐటీ పార్క్ నిర్మించాల్సిన చోట డంప్ యార్డా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



