ముంబయి : గల్లీ క్రికెట్ మజాను ఫ్లడ్లైట్ల వెలుతురులో స్టేడియంలోకి తీసుకొచ్చేందుకు ఐఎస్పీఎల్ ముందుకొచ్చింది. మార్చి 2 నుంచి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ముంబయిలో జరుగనుంది. టీ10 ఫార్మాట్లో టెన్నిస్ బాల్తో ఆడనున్న ఈ లీగ్లో హైదరాబాద్, ముంబయి, బెంగళూర్, చెన్నై, కోల్కత, శ్రీనగర్ ప్రాంఛైజీలు పోటీపడనున్నాయి. లీగ్లో పోటీపడాలనుకునే ఔత్సాహిక క్రికెటర్లు డిసెంబర్ 20 నుంచి ఐఎస్పీఎల్ టీ10 వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు నిర్వాహకులతో కలిసి భారత మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఐఎస్పీఎల్ లోగో, ట్రోఫీని ఆవిష్కరించారు.