మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
నవతెలంగాణ-మల్హర్ రావు
సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు మేలు చేసిన కేసీఆర్ ప్రభుత్వంలోని గిరిజనుల సంక్షేమం, అభివృద్ది జరిగిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. మండలం దుబ్బపేట గ్రామపంచాయతీ ఆవరణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలోనే తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి పరిపాలన వారి చేతులకు అప్పగించిన చరిత్ర కేసీఆర్దని ఆయన కొనియాడారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్ని వర్గాలకు మేలు చేయాలన్న సంకల్పంతో ఎస్టీ స్పెషల్ డెవలప్ ఫండ్ కింద రూ.13వేల 412కోట్లను కేటాయించారని,ఎస్టీ రిజర్వేషన్లను ఆరు నుంచి 10శాతం పెంచిన ఘనత కేసీఆర్దేనని వివరించారు.ఈనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాటలతోనే సరిపెడుతుందని,మూడేళ్లలో చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.కేసీఆర్ ప్రభుత్వం గిరిజనులను అభివృద్ది,వారి వ్యవసాయ భూములను అభివృద్ది చేయాలని గిరి వికాసం అనే పథకాన్ని తీసుకువచ్చారని, పంట పొలాల్లో బోర్లు వేసి సాగులోకి తీసుకుచ్చారని అన్నారు. 2022 డిసెంబర్ నాటికి 19698మంది రైతులకు 56613ఎకరాల భూమిని సాగులోకి తీసుకువచ్చారని, 1682అవాసాల్లో రోడ్డు నిర్మాణాలు, నీటి సౌకర్యాలు, విదేశీ విద్య, కేసీఆర్ కిట్లు, గిరిజన యువకులకు వాహనాలు, మేడారం నాగోబా, సమ్మక్క సారలమ్మ జాతరలకు ప్రాధాన్యత ఇస్తూ ఆదివాసీల ఆత్మగౌరవ భవనాలు నిర్మాణం చేశారని తెలిపారు.8లక్షల23వేల 780మంది రైతులకు రూ.7350కోట్లు ఇచ్చిన చరిత్రను మర్చిపోవద్దన్నారు. పాలకుర్తి మండలంలో బామ్లానాయక్, మల్హర్ మండలంలో దుబ్బపేట, మహముత్తారం మండలంలో ప్రేమనగర్ తండా, పలిమెల మండలంలో మోదేడులను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.గిరిజన అభివృద్ది కోసం గురుకులాలను ఏర్పాటు చేయడంతో పాటు ఐఐటీ, నీట్ కోచింగ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.గిరిజన తండాకు వెళ్లినా పదేండ్లలో కేసీఆర్ చేసినవే కనుబడుతాయని, కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకోకపోతే మనల్నీ మోసం చేయడానికి వెనుకాడరని అన్నారు.ఎస్టీ డిక్లరేషన్లు అమలు కావాలంటే గిరిజనుల్లో చైతన్యం రావాలని, మహనీయులు సంత్ సేవాలాల్ మహరాజ్, కొమురం బీంలాంటి మహనీయుల పోరాట స్పూర్తితో ముందుకు వెళ్లాలని అన్నారు. గిరిజనుల కోసం ఏదైనా జరిగిందంటే అది కేసీఆర్ ప్రభుత్వంలోనే అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.



