– అత్యున్నతస్థాయి నాణ్యత పరీక్షలో ఔషధ నమూనాలు విఫలం
– ఇందులో పారాసెటమాల్తో సహా 50 డ్రగ్స్
– ప్రామాణిక నాణ్యత లేనివిగా గుర్తించిన సీడీఎస్సీఓ
న్యూఢిల్లీ: భారత్లోని అగ్రశ్రేణి ఔషధ నియంత్రణ సంస్థ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల చికిత్స కోసం విస్తృతంగా ఉపయోగించే పారాసెటమాల్, పాంటోప్రజోల్, కొన్ని యాంటీబయాటిక్స్తో సహా దాదాపు 50 ఔషధాల నమూనాలను ‘ప్రామాణిక నాణ్యత లేనివి’ అని కనుగొన్నది. వీటితో పాటు అనేక ఔషధ నమూనాలు అత్యున్నతస్థాయి నాణ్యత పరీక్షలో విఫలమయ్యాయి. రాష్ట్ర డ్రగ్ రెగ్యులేటర్లు ప్రమేయం ఉన్న ఫార్మాస్యూటికల్ కంపెనీలకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తున్నది. మే నెలలో అపెక్స్ డ్రగ్ రెగ్యులేటరీ బాడీ నుంచి వచ్చిన హెచ్చరిక ప్రకారం.. హిమాచల్ ప్రదేశ్లో ఇరవై రెండు సబ్-స్టాండర్డ్ డ్రగ్స్ తయారు చేయబడ్డాయి. జైపూర్, హైదరాబాద్, వాఘోడియా, గుజరాత్లోని వడోదర, ఏపీ, ఇండోర్ల నుంచి కూడా నమూనాలను సేకరించారు. జూన్ 20న జారీ చేసిన డ్రగ్ అలర్ట్ ప్రకారం మొత్తం 52 నమూనాలు సీడీఎస్సీఓ నిర్వహించిన నాణ్యత పరీక్షలో విఫలమయ్యాయి. కాగా, లోపభూయిష్ట నమూనాలను మార్కెట్ నుంచి వెనక్కి రప్పించటానికి రాష్ట్ర డ్రగ్ నియంత్రణ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో తయారైన దాదాపు 120 ఔషధాల నమూనాలు గతేడాది పరీక్షలలో విఫలమయ్యాయి.