నవతెలంగాణ – హైదరాబాద్: తికమ్గర్హ్ జిల్లాలోని మర్గువా గ్రామానికి చెందిన వినోద్ బన్స్కర్(35) ఇండియన్ ఆర్మీలో జవాన్గా పని చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. అయితే ఆదివారం మధ్యాహ్నం బిరాయు గ్రామంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు వినోద్. అక్కడ క్రికెట్ ఆడుతుండగా ఛాతీలో నొప్పిగా ఉందని చెబుతూ కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన వినోద్ అన్న జగదీశ్ బన్స్కర్.. హుటాహుటిన తికమ్గర్హ్ జిల్లా ఆస్పత్రికి తరలించాడు. గుండెపోటుకు గురైన వినోద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో వినోద్ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. లాన్స్ నాయక్ వినోద్ ఉత్తరప్రదేశ్లోని షాహారన్పూర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఫిబ్రవరి మొదటి వారంలో వినోద్ విధులకు హాజరు కావాల్సి ఉందని జగదీశ్ తెలిపాడు. మా కళ్లెదుటే తమ్ముడు ప్రాణాలు కోల్పోవడం బాధాకరంగా ఉందని కన్నీళ్లు పెట్టుకున్నాడు జగదీశ్.