నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో సంక్షేమమే తప్ప.. సంక్షోభం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం కేటీఆర్ వివరణ ఇచ్చారు. ఏండ్లుగా తెలంగాణ అభివృద్ధికి నిర్మాణాత్మకంగా పని చేస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు. ఒక వైపు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ మరో వైపు మౌలిక వసతులకు భారీగా కేటాయింపులు చేస్తున్నాం. బడ్జెట్ పెట్టుబడి వ్యయంలో తెలంగాణే ముందుంది. బడ్జెట్లో పెట్టుబడి వ్యయం ఛత్తీస్గఢ్లో 15 శాతం, రాజస్థాన్లో 16 శాతం మాత్రమే ఉంది. తెలంగాణలో మాత్రం 26 శాతం పెట్టుబడి వ్యయంగా పెడుతున్నాం. నేను చెప్పేది తప్పుంటే వచ్చే ఎన్నికల్లో ఓడించండి అని కేటీఆర్ సవాల్ చేశారు. రాష్ట్ర బడ్జెట్ అంటే విపక్షాలకు జమ ఖర్చుల లెక్క మాత్రమే అని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్కు బడ్జెట్ అంటే రాష్ట్ర ప్రజల జీవనరేఖ. తెలంగాణ నమూనా.. అంటే సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి. మౌలిక వసతుల కల్పనలో గ్రామాలు, పట్టణాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నాం. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవా రంగం దూసుకుపోతున్నాయి. తెలంగాణలో సంక్షేమమే తప్ప సంక్షోభం లేదు అని కేటీఆర్ తేల్చి చెప్పారు.