సోమవారం రాష్ట్ర క్యాబినెట్ భేటీ

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

నవతెలంగాణ హైదరాబాద్: ఈనెల 31వ తేదీ సోమవారం మధ్యాహ్నాం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సందర్భంగా దాదాపు 40 నుంచి 50 అంశాల మీద రాష్ట్ర మంత్రివర్గం చర్చించనున్నది. ఇందులో భాగంగా భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు, ప్రభుత్వ చర్యలపై క్యాబినెట్ సమీక్షించనున్నది. రాష్ట్రంలో రైతాంగం వ్యవసాయ సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించవలసిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై క్యాబినెట్ చర్చించనున్నది. రాష్ట్రంలో ఉధృతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నది. అందుకు యుద్ధప్రాతిపదికన రోడ్లను తిరిగి పునరుద్ధిరించడం కోసం చేపట్టనున్న చర్యలపై క్యాబినెట్ చర్చించనున్నది. అదే సందర్భంలో ఆర్టీసీ సంస్థకు సంబంధించిన అంశాలతో పాటు, ఉద్యోగులకు జీతభత్యాల పెంపు తదితర అంశాలపై చర్చించి క్యాబినెట్ తగు నిర్ణయం తీసుకోనున్నది.

Spread the love