కుల వృత్తులకు ఆర్ధికసాయంపై రెండు రోజుల్లో విధివిధానాలు

అమరుల స్మారకం ముందు తెలంగాణ తల్లి విగ్రహం
– హెచ్‌వోడీలకు ట్విన్‌ టవర్లు
– సచివాలయం సమీపంలో నిర్మాణం : సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కుల వృత్తులకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలోని బీసీ, ఎంబీసీ కులాలు, వృత్తులే ఆధారంగా జీవించే కులాలు, సంచార జాతులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. వీరికి రూ. లక్ష చొప్పున దశలవారీగా ఆర్థిక సాయం అందిస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన విధి విధానాలను మరోరెండు రోజుల్లో ఖరారు చేస్తామని ఉపసంఘం సభ్యుడు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సీఎంకు వివరించారు. త్వరితగతిన విధి విధానాలను ఖరారు చేసి సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఆర్థిక సహాయాన్ని ప్రారంభించాలని గంగులను ఆయన ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించిన పురోగతిపై సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్‌ రెండు నుంచి రోజూ వారీగా నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సీఎంకు వివరించారు. దేశం గర్వించేలా ఉన్న రాష్ట్ర సచివాలయం… ఉద్యోగుల విధి నిర్వహణకు సకల వసతులతో గొప్పగా నిర్మితమైందని సీఎం ఈ సందర్భంగా అన్నారు. అధికారులు, సిబ్బంది ఆహ్లాదకర వాతావరణంలో పనిచేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్‌ను ప్రారంభించుకుని నెల రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో సచివాలయంలో మౌలిక వసతుల పూర్తి, సౌకర్యాలు అందుబాటులోకి రావడం గురించి సీఎస్‌ శాంతకుమారిని, సంబంధిత ఉన్నతాధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు.
అన్ని శాఖల హెచ్‌వోడీలు ఒకే చోట…
సచివాలయం పూర్తిస్థాయిలో పని విధానంలోకి వచ్చిన నేపథ్యంలో, ఆయా ప్రభుత్వ విభాగాధిపతుల (హెచ్‌వోడీ) కార్యాలయాలను ఒకే చోటకు చేర్చడం గురించి సీఎం చర్చించారు. హెచ్‌వోడీ అధికారులకు సెక్రటేరియట్‌తో తరచుగా పని ఉంటున్న నేపథ్యంలో వారి కార్యాలయాలను కూడా సెక్రటేరియట్‌కు దగ్గరలో సమీకృతంగా ఒకే చోట నిర్మించేందుకు ఆయన నిర్ణయించారు. అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వ శాఖల్లోని హెచ్‌వోడీలు, వాటి ఆధ్వర్యంలో పని చేస్తున్న పూర్తిస్థాయి సిబ్బంది సంఖ్య, తదితర అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సెక్రటేరియట్‌కు అందుబాటులో విశాలవంతమైన ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడున్నాయనే విషయాన్ని సీఎం అడిగి తెలుసుకున్నారు. స్థల నిర్దారణ తర్వాత అవసరం మేరకు, హెచ్‌వోడీలన్నీ ఒకే చోట ఉండేలా ట్విన్‌ టవర్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు కేసీఆర్‌ తెలిపారు. సమీక్షా సమావేశం అనంతరం అమరుల స్మారకం వద్దకు సీఎం వెళ్లారు. అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలిస్తూ కలియ తిరిగారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆర్‌ అండ్‌ బి అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటికే పనులన్నీ పూర్తయి… చివరిదశ సుందరీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్లకు సీఎం పలు సూచనలు చేశారు. అమరుల స్మారకానికి ముందున్న విశాలమైన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. విగ్రహానికి రెండు వైపులా అత్యద్భుతమైన ఫౌంటేన్లతో సుందరంగా తీర్చిదిద్దాలని ఆర్‌ అండ్‌ బి ఇంజనీర్‌ శశిధర్‌ను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాలు జరిగినన్ని రోజులూ అమరుల స్మారకం వద్దకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అక్కడి నుంచి బీఆర్‌కే భవన్‌ వద్ద నిర్మించిన వంతెనల నిర్మాణాన్ని సీఎం పరిశీలించారు. నూతన సచివాలయ నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా చూసేందుకు ఈ వంతెనలను నిర్మించారు. సీఎం వెంట మంత్రులు గంగుల కమలాకర్‌, శ్రీనివాసగౌడ్‌, ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, పల్లా రాజేశ్వరరెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డితోపాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సోమేశ్‌కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులున్నారు.

Spread the love