నవతెలంగాణ- హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు సీఎల్పీ వేదికగా సమావేశమై ఈ అంశంపై చర్చించారు. అనంతరం కొండా సురేఖను మంత్రివర్గం నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం.
కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్పై చేసిన వ్యాఖ్యలపై సమావేశంలో తీవ్ర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సుస్మిత వ్యాఖ్యలను సురేఖ ఇప్పటివరకు ఖండించకపోవడంపై ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలపై బాధ్యత వహించాల్సిందేనని అన్నారు.సుస్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని సురేఖ చెప్పడాన్ని కూడా ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. సీఎం రేవంత్రెడ్డిని విమర్శించినప్పుడు ఖండించడం కనీస బాధ్యత అని పేర్కొంటూ, పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసేవారిపై అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


