నవతెలంగాణ-రాయికల్
పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో “తరంగిణి-2026”వార్షికోత్సవ వేడుకలను మంగళవారం ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ జూపల్లి వేణుగోపాల్ రావు మాట్లాడుతూ… విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడంలో వార్షికోత్సవాలు కీలకమని అన్నారు.
విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటల్లోనూ రాణించాలని సూచించారు. సోషల్ మీడియాకు బానిసలు కాకుండా చదువుపై దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలపై శ్రద్ధ వహించాలని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, గిటార్, పియానో వాద్యాలతో పాటు పౌరాణిక, దేశభక్తి నృత్యాలు ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వేణుగోపాలరావు, డైరెక్టర్ జూపల్లి తిరుపతిరావు, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.



