Sunday, September 13, 2026
E-PAPER
Homeజాతీయంకలిసే సాగుదాం...

కలిసే సాగుదాం…

- Advertisement -

భారత్‌, చైనా నేతల పునరుద్ఘాటన
సరిహద్దుల్లో శాంతి ఉంటేనే అన్నీ : ప్రధాని మోడీ
సభ్య దేశాల మధ్య సమన్వయం అవసరమన్న జిన్‌‌పింగ్‌


న్యూఢిల్లీ
: బ్రిక్స్‌ ‌దేశాల శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో శనివారం చైనా అధ్యక్షుడు జిన్‌‌పింగ్‌‌తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. గత ఏడాది తియాన్‌‌జిన్‌‌లో చివరిసారిగా సమావేశమైన తర్వాత ఇరు దేశాల సంబంధాల్లో నెలకొన్న పురోగతిని ఇరువురు నేతలు స్వాగతించారు. రెండు దేశాలు తమ సంబంధాల్లో వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథాన్ని కలిగివుండాలని పునరుద్ఘాటించారు. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాల్లో సాధించిన పురోగతిని స్వాగతించారు. సాంస్కృతిక మార్పిడి, వ్యాపార, వాణిజ్య సంబంధాలను, రెండు దేశాల మధ్య రాకపోకలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇక ఆర్థిక, వాణిజ్య సంబంధాల విషయానికి వస్తే, వ్యవస్థాగత వాణిజ్య అసమతుల్యత, సరఫరా మార్గాల్లో సమస్యలతోపాటు ఒకరి ఆందోళనలను మరొకరు పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకత వుందని ఇరువురు నేతలు పేర్కొన్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై, సవాళ్లను పరిష్కరించుకోవడంపై ఉభయ పక్షాలు తమ ఉమ్మడి అవగాహనను మరింత విస్తరించుకోవాల్సి వుందని అంగీకరించారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

సరిహద్దుల్లో శాంతి వుంటేనే..
ద్వైపాక్షిక సంబంధాలు వృద్ధి చెందుతూ ఉండాలంటే సరిహద్దు ప్రాంతాల్లో శాంతి సుస్థిరతలు కొనసాగడమనేది అత్యవసరమైన ప్రాతిపదిక అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, పరస్పర ప్రయోజనాలు ఈ మూడు అంశాల ప్రాతిపదికనే ఉభయ పక్షాలు వ్యవహరించాలని తెలిపారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రకటన పేర్కొంది. ఈ సందర్భంగా జిన్‌‌పింగ్‌ ‌మాట్లాడుతూ, చైనా, భారత్‌‌లు ఒకరి సామర్ధ్యాలు, బలం నుండి మరొకరు నేర్చుకుంటూ ఉమ్మడి అభివృద్ధిని సాధించగలవని అన్నారు. అత్యంత నాణ్యతతో కూడిన బ్రిక్స్‌ ‌సహకారాన్ని మరింత విస్తరించేందుకు చైనా, భారత్‌‌లు చేతులు కలపాలని అన్నారు. సమానమైన, సమర్ధవంతమైన బహుళ ధృవ ప్రపంచ వ్యవస్థను రెండు దేశాలు సమర్ధించాలన్నారు. ఈ మేరకు జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -