– అదుపులోకి తీసుకున్న పోలీసులు
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. సీఎం తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. భూపాలపల్లి జిల్లాకు చెందిన కృష్ణసాగర్ శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసం వద్ద పెట్రోల్ పోసుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతన్ని పట్టుకొని ఒంటిపై నీళ్లు పోసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తూ కొన్ని సంవత్సరాలుగా పార్టీని నమ్ముకున్న తమకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అందుకే ఆత్మహత్యాయత్నం చేశానని పోలీసుల విచారణలో కృష్ణాసాగర్ తెలిపాడు. సీఎం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతోనే ఈ ఘటనకు పాల్పడినట్టు అతను చెప్పినట్టు తెలిసింది.