అండర్‌-19 సిరీస్‌కు మనోళ్లు

అండర్‌-19 సిరీస్‌కు మనోళ్లు– హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌ అభినందన
హైదరాబాద్‌ : అంతర్జాతీయ మెన్స్‌ అండర్‌-19 సిరీస్‌కు హైదరాబాద్‌ నుంచి ముగ్గురు క్రికెటర్లు ఎంపికయ్యారు. నాలుగు జట్లు పోటీపడనున్న ఈ టోర్నీ నవంబర్‌ 13 నుంచి 27 వరకు విజయవాడలో జరుగనుంది. ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌ అండర్‌-19 జట్లు, భారత్‌ నుంచి రెండు జట్లు ఈ టోర్నీలో టైటిల్‌ వేటలో పోటీపడుతున్నాయి. హైదరాబాద్‌ యువ క్రికెటర్లు మురుగన్‌ అశ్విన్‌, అరవెల్లి అవినాశ్‌ రావు, నిశాంత్‌ ఎస్‌లు ఎంపికయ్యారు. ఇటీవల బీసీసీఐ అండర్‌-19 టోర్నీలో ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు. ఇక దేశవాళీ మహిళల ఇంటర్‌ జోనల్‌ ట్రోఫీలో సౌత్‌ జోన్‌కు హైదరాబాద్‌ క్రికెటర్లు గొంగడి త్రిష, భోగి శ్రావణిలు ఎంపికయ్యారు. నిశాంత్‌ శరణు ఇటీవల హైదరాబాద్‌లో పాకిస్థాన్‌ ప్రపంచకప్‌ మ్యాచులకు ఆ జట్టు నెట్‌ బౌలర్‌గా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అండర్‌-19 సిరీస్‌, ఇంటర్‌ జోనల్‌ ట్రోఫీకి ఎంపికైన క్రికెటర్లను హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు అభినందించారు.

Spread the love