పెద్దపల్లిలో దారుణం.. మైనర్‌ బాలికపై సామూహిక లైంగికదాడి

నవతెలంగాణ-హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన మైనర్‌ బాలికపై నలుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు… తీవ్ర గాయాలైన బాలికను.. చికిత్స కోసం ప్రయివేటు వాహనంలో మధ్యప్రదేశ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మూడు రోజుల క్రితం (ఆగస్టు 14) అప్పన్నపేట శివారులోని ఓ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  రియల్ ఎస్టేట్ వెంచర్ పనులు పర్యవేక్షిస్తున్న సూపర్ వైజర్ ఫయాజ్.. బాలికను మాయమాటలు చెప్పి శివార్లలోకి తీసుకెళ్లాడు. అతడితోపాటు మరో ముగ్గురు కలిసి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ విషయం బిల్డింగ్‌ కాంట్రాక్టర్‌ గోపాల్‌కు తెలియడంతో.. ఈ సమస్య తనమెడకెక్కడ చుట్టుకుంటుందోనని బాలికను, ఆమె కుటుంబ సభ్యులను తిరిగి మధ్యప్రదేశ్‌కు పంపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో బాధితురాలు మృతిచెందింది. దీంతో మధ్యప్రదేశ్‌లోని కజరీకి తీసుకెళ్లి బాలిక అంత్యక్రియలు పూర్తి చేయాలని బిల్డింగ్ కాంట్రాక్టర్ ఆమె కుటుంబీకులను బలవంత పెట్టాడు. అయితే హైదరాబాద్‌లో పనిచేస్తున్న బాలిక సోదరుడి రాక కోసం కుటుంబీకులు అంత్యక్రియలు ఆపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు ఫయాజ్‌తోపాటు మరో నిందితుడు హరీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. పెద్దపెల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ నేతృత్వంలోని పోలీసుల బృందం. అప్పన్నపేటలో పనిచేస్తున్న తోటివారిని విచారించారు. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. సామూహిక లైంగికదాడి తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే బెదిరించినట్లు బాలిక చివరి మాటలను బంధువులు ఆడియో రికార్డు చేశారు.

Spread the love