నవతెలంగాణ – హైదరాబాద్ : అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న మయన్మార్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న షాన్ రాష్ట్రంలో ఆదివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. గనుల తవ్వకాల కోసం నిల్వ ఉంచిన పేలుడు పదార్థాల డిపో ఒక్కసారిగా పేలిపోవడంతో 55 మంది ప్రాణాలు కోల్పోగా, 74 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. చైనా సరిహద్దుకు కేవలం 3 కిలోమీటర్ల దూరంలోని నమ్ఖామ్ టౌన్షిప్ పరిధిలోని కౌంగ్ టాట్ గ్రామంలో ఈ విషాదం జరిగింది. మృతుల్లో 30 మంది పురుషులు, 25 మంది మహిళలు ఉన్నట్లు స్థానిక మీడియా సంస్థలు, బీబీసీ కథనాలు వెల్లడించాయి. పేలుడు ధాటికి సమీపంలోని సుమారు 100 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.
మయన్మార్లో సైనిక ప్రభుత్వానికి, తిరుగుబాటు గ్రూపులకు మధ్య పోరాటం జరుగుతున్న నేపథ్యంలో తొలుత ఈ పేలుడును ప్రభుత్వ సైన్యం జరిపిన వైమానిక దాడిగా స్థానికులు భావించారు. ఆకాశంలో దట్టమైన నల్లటి పొగలు కమ్ముకోవడంతో ప్రాణభయంతో పరుగులు తీశారు. అయితే, ఇది ప్రమాదవశాత్తూ జరిగిందని తర్వాత స్పష్టత వచ్చింది. ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ ఈ ఘటనపై స్పందించింది. గనులు, క్వారీల కోసం తమ ఆర్థిక విభాగం నిల్వ ఉంచిన ‘జెలిగ్నైట్’ వంటి పేలుడు పదార్థాలు అస్థిరత కారణంగా పేలిపోయాయని ఓ ప్రకటనలో తెలిపింది.



