నవతెలంగాణ-హైదరాబాద్: హిమచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో పారిశుధ్యకార్మికులు కదంతొక్కారు. 10 శాతం వేతనాన్ని పునరుద్ధరించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే 4-9-14 పే స్కేల్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, సిమ్లా ఎన్విరాన్మెంట్, హెరిటేజ్ కన్జర్వేషన్ అండ్ బ్యూటిఫికేషన్ సొసైటీ (SEHB) వెల్ఫేర్ వర్కర్స్ యూనియన్ కింద పనిచేస్తున్న 900 మందికి పైగా పారిశుధ్య కార్మికులు శుక్రవారం నిరవధిక సమ్మెకు దిగారు.
ప్రభుత్వం తమ ఉద్యోగాల నుండి తొలగించినా అభ్యంతరంలేదని, తమ డిమాండ్లు అమలు చేసేవరకు పోరాటం సాగిస్తామని, అధికారులకు 14 రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చామని కార్మికులు తెలియజేశారు. నగరంలో మున్సిపల్ పన్నులు, వినియోగ ఛార్జీలను 10 శాతం పెంచుతున్నప్పటికీ, పారిశుధ్య కార్మికులకు అలాంటి ప్రయోజనాలను నిరాకరించారని కూడా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
వారి ఆందోళనకు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (CITU) మద్దతు తెలిపింది. గత మూడేళ్లుగా పదేపదే చర్చలు జరిపినప్పటికీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం విఫలమైందని ఆ రాష్ట్ర CITU అధ్యక్షుడు విజయేంద్ర మెహ్రా విమర్శించారు. కార్మిక కార్యాలయంలో సుమారు 30 సమావేశాలు జరిగాయని, అయితే మున్సిపల్ కమిషనర్, జాయింట్ కమిషనర్తో సహా ఉన్నతాధికారులు చర్చల్లో అర్థవంతంగా పాల్గొనలేదని మెహ్రా మండిపడ్డారు.



