నవతెలంగాణ – రాయపోల్
ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల నుంచి పంటల సంరక్షణకు చేపట్టవలసిన యాజమాన్య పద్దతులు పాటించి రైతులు పంటలను కాపాడుకోవాలని గజ్వేల్ ఏడిఏ బాబు నాయక్ పేర్కొన్నారు.
భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో పొలం నుంచి మురుగు నీటిని తీసివేయాలి.
రాబోవు రెండు రోజులలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంట పొలాల్లో మందులను పిచికారి చేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలి.
వరి:
ప్రస్తుతం దుబ్బు చేసే దశలో ఉంది. బ్యాక్టీరియా ఎండు ఆకు తెగులు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి రైతులు 0.2 గ్రాములు ప్లాంటమైసిన్ మందును లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. అలాగే కాండం కుళ్ళు రావడానికి కూడా అవకాశం ఎక్కువ, 2. 5 గ్రా. కార్బెండజిమ్ + మ్యాంకోజేబ్ శీలీంద్రనాశక మందును లేదా ఒక మిల్లీలీటరు మైసిన్ వాలిడామైసిన్ కానీ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అగ్గి తెగులు కూడా రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. తెగులు గమనించినట్లయితే 0.6 గ్రాముల ట్రై సైక్లోజోల్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. రెండవ దఫా యూరియాని వేసుకోవడానికి అనుకూలమైన సమయం. బ్యాక్టీరియా ఎండాకు తెగులు గనుక ఆశించి ఉన్నట్లయితే నత్రజని మోతాదుకు మించి ఉపయోగించకూడదు లేదా వేసుకోవడం వాయిదా వేసుకోవాలి.
ప్రత్తి:
.ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తగ్గిన తరువాత ఎకరాకు 25 కిలోల యూరియా మరియు 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్ రసాయనిక ఎరువులను పైపాటుగా పంటకు మొక్కల మొదళ్ళలో 7-10 సెం.మీ దూరంలో పాదులు తీసి రసాయనిక ఎరువులను వేసి మట్టితో కప్పవలెను.
ముంపుకు గురైన పంట త్వరగా కోలుకోవడానికి 19:19:19 లేదా 13-0-45 లేదా 10 గ్రా. యూరియా లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
పిండి నల్లి రావడానికి అవకాశం ఎక్కువ, ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా రెండు మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
నేల ద్వారా వ్యాప్తి చెందే ఎండు తెగులు నివారించుటకు 3 గ్రా. కాపర్-ఆక్సి-క్లోరైడ్ లేదా ఆల్టర్నేరియా ఆకు మచ్చ తెగులు కొరకు 2. 5 గ్రా. కార్బెండజిమ్ + మ్యాంకోజేబ్ శీలీంద్రనాశక మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్టు వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
మొక్కజొన్న:
•అధిక వర్షాల వలన నేలలో భాస్వరం లోపం ఏర్పడి మొక్కలన్ని ఊదారంగులోకి మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పంట మోకాలు ఎత్తు నుండి జల్లు కట్టే దశ వరకు ఉంది. కావున వర్షాలు నిలిచిన తర్వాత మోకాలు ఎత్తు దశలో ఉన్నా పంటకు 5 గ్రా. 19-19-19 లేదా 20 గ్రా డిఎపి మందును లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారి చేయాలి.
•వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత వర్షాధార పంటకు పైపాటుగా ఎకరాకు 20 కిలోల యూరియా మరియు 15 కిలోల పోటాష్ ను వేసుకోవాలి.
బ్యాక్టీరియా కాండంకుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఎక్కువ నివారణ కొరకు బ్లీచింగ్ పౌడర్ ను 5 కిలోలు వేసుకోవాలి. కత్తెర పురుగును కూడా గమనించుకుంటూ అవసరమైనట్లయితే 0.3 మిల్లీ లీటర్ల క్లోరైంటిని పోల్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రస్తుత వర్షాల నుంచి పంటలను రక్షించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.