సిఐ శంకర్ గౌడ్
నవతెలంగాణ-ఆలేరు టౌన్
వరంగల్ ,హైదరాబాద్ జాతీయ రహదారి హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్ మాదాసు శంకర్ గౌడ్ అన్నారు. ఆలేర్ పట్టణంలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, రోడ్డు నిబంధనలు ప్రతి వాహనదారుడు పాటించాలన్నారు. ఆలేరు సర్కిల్ పరిధిలోని మండలాలు, గ్రామాలల్లో ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలన్నారు. తద్వారా నేరాల నియంత్రణతో పాటు, దొంగతనాలు అరికట్టొచ్చని తెలిపారు.
నేరాల అదుపునకు, శాంతి భద్రత నెలకొల్పేందుకు, సీసీటీవీల పాత్ర కీలకమన్నారు. సీసీటీవీల ఏర్పాటుకు పట్టణం మరియు గ్రామాలలో ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, ఈ ప్రాంతంలో చదువుకొని గొప్ప గొప్ప వ్యాపారాలు చేస్తూ, ఉద్యోగాలు పొంది వివిధ ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్న వారి సహకారంతో సిసీ టీవీల ఏర్పాటుకు కృషి జరగాలన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. యువత చిన్న సిగరెట్ తో మొదలై, డ్రగ్స్, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకి అలవాటు పడుతున్నారని, యువకులు చెడు మార్గాల వైపు ఆకర్షితులు కావొద్దు అన్నారు.
డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు హెచ్ ఓలు వినయ్ కుమార్, ఉదయ్ కిరణ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



