రూ.1.10 లక్షల కోట్ల పసిడి నిల్వల అమ్మకం
రెండు వారాల్లోనే ఆర్బీఐ కఠిన నిర్ణయాలు
మోడీ సర్కార్ కోసం రిజర్వ్ బ్యాంక్ నిర్వాకం
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను హోల్ సేల్ గా అమ్మేస్తోంది. ప్రయివేట్ సంస్థలు, తమకు అనుకూలమైన సంపన్నుల కోసం జీ హుజుర్ అనేలా మారిపోయింది. పశ్చిమాసియా యుద్ధంలో భారత్ అచేతన వ్యవస్థలా తయారైపోయింది. మోడీ విధాన నిర్ణయాలు అస్తవ్యస్తంగా మారిపోయాయని దేశంలోని మేధావులు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు గళమెత్తినా పట్టించుకోవటం లేదు. తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్న తీరులా వ్యవహరిస్తున్నది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కేంద్రబ్యాంకు నుంచి డివిడెండ్ రూపంలో నిధులు తీసుకుని ఖజానా నిల్వల్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. కానీ రూపాయి పతనం, జీడీపీ దిగజారటం, ఇలా మరెన్నో కారణాలు చూపి..ఆర్బీఐలో ఉన్న బంగారపు నిల్వల్ని కరిగేస్తున్నది. దీంతో మోడీ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన ఆస్తులను కరిగేస్తోంది. ఇటీవల ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ డివిడెండ్ను ప్రకటించిన కేంద్ర బ్యాంక్.. తాజాగా లక్షల కోట్ల విలువ చేసే బంగారాన్ని కూడా విక్రయించిందని రిపోర్టులు వస్తోన్నాయి. డాలర్తో రూపాయి కరెన్సీ రికార్డ్ పతనంతో బీజేపీ ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోంది. దీన్ని అధిగమించడానికి రూపాయి విలువను నిలబెట్టుకోవడానికి, విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి ఆర్బీఐ అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి రావడం ఆందోళనకరమైన అంశం. బ్లూమ్బెర్గ్ ఎకనామిక్స్ అంచనా ప్రకారం.. మే 22తో ముగిసిన రెండు వారాల్లోనే ఆర్బీఐ సుమారు 12 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.10 లక్షల కోట్లు) విలువైన బంగారు నిల్వలను విక్రయించాల్సి వచ్చింది. సాధారణంగా బంగారం అనేది సురక్షితమైన ఆస్తి. అయినప్పటికీ.. తక్షణమే మార్కెట్లో జోక్యం చేసుకునేందుకు వీలుగా ఉండే విదేశీ కరెన్సీ ఆస్తులను (డాలర్లను) పెంచుకోవడానికి కేంద్ర బ్యాంకు తన బులియన్ నిల్వలను తగ్గించుకుందని సమాచారం. దీంతో దేశ కరెంట్ అకౌంట్ లోటు పెరగొచ్చని నిపుణులు భావిస్తున్నారు.ఈ పరిణామంతో ఆర్బీఐ ఖజానాను ఖాళీ చేయాలనే ప్రధాని మోడీ లక్ష్యం క్రమంగా నెరవేరుతోన్నట్లు స్పష్టమవుతోంది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26కు గాను కేంద్రానికి రూ.2.86 లక్షల కోట్ల భారీ డివిడెండ్ను ఆర్బీఐ ఇటీవల ప్రకటిం చింది. 2022-23 నాటి రూ.87,416 కోట్ల డివిడెండ్తో పోల్చితే మూడేం డ్లలోనే నాలుగు రెట్ల మేర పెంచేసింది. తాజాగా బంగారాన్ని విక్రయించారనే నివేదిక ఆందోళన కలిగిస్తోంది. ‘‘ఆర్బీఐ తన విదేశీ కరెన్సీ ఆస్తులకు సుమారు 7.5 బిలియన్ డాలర్లను జోడించింది. బంగారంపై దిగుమతి సుంకాలను పెంచినప్పటికీ ఈ బంగారు నిల్వలు తగ్గడం గమనార్హం. సాధారణంగా దిగుమతి సుంకాలు పెరిగితే ఆర్బీఐ వద్ద ఉన్న బులియన్ నిల్వలు, దానికి సంబంధించిన డాలర్ ఆస్తుల విలువ పెరగాలి. ఈ సరళిని బట్టి చూస్తే కేంద్ర బ్యాంకు బంగారం విక్రయాలు జరిపి ఉండే అవకాశం ఉంది.’’ అని బ్లూమ్బెర్గ్ ఎకనామిక్స్ సీనియర్ ఇండియా ఎకనామిస్ట్ అభిషేక్ గుప్తా పేర్కొన్నారు. ఒకవేళ ఇది నిజమని తేలితే ఇరాన్ సంక్షోభం, హార్ముజ్ గుండా షిప్పింగ్ , ముడిచమురు ధరలు పెరగడం వల్ల ఏర్పడుతున్న ఆర్థిక ఒత్తిడిపై విధాన నిర్ణేతలలో పెరుగుతున్న ఆందోళనలను ఇది ప్రతిబింబిస్తుందని అన్నారు. మార్చి చివరి నాటికి ఆర్బీఐ వద్ద 880.52 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. ఈ నిల్వలలో దాదాపు 77 శాతం భారత్లోనే నిల్వ చేసింది. ఇది ఆరు నెలల క్రితం ఉన్న 66 శాతం కంటే ఎక్కువ. విదేశీ బంగారు నిల్వలలో ఎక్కువ భాగం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వద్ద ఉన్నాయని ఆర్బీఐ ఏప్రిల్లో విడుదల చేసిన రిపోర్ట్లో పేర్కొంది.
కరిగిపోతున్న బంగారం
- Advertisement -
- Advertisement -



