మిల్లర్ ఒంటరి పోరాటం.. 49.4 ఓవర్లలో దక్షిణాఫ్రికా ఆలౌట్

నవతెలంగాణ హైదరాబాద్: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీఫైనల్ చాలా పెలవంగా సాగుతోంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తడబడింది. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే క్లాసెన్ (47), మిల్లర్ (101) ఆదుకోవడంతో దక్షిణాఫ్రికా కాస్త కోలుకున్నా..  క్లాసెన్ ఔట్ కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. మిల్లర్‌కు సరైన భాగస్వామి లేకపోవడంతో దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. ఒక రకంగా ఇది మిల్లర్ (116 బాల్స్‌లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు) ఒంటరి పోరాటమే అని చెప్పాలి.
కాగా ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు, ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు పడగొట్టారు. జాష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్ తలో రెండు వికెట్లు సాధించారు. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఆడమ్ జంపా ఈ మ్యాచ్‌లో వికెట్లేమీ సాధించలేకపోయాడు. సెమీస్ అంటే అనవసరంగా ఒత్తిడికి గురయ్యే సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లోనూ అదే తడబాటును కొనసాగించింది. దీంతో సఫారీలకు చోకర్స్ అనే మాట సరిగ్గా సరిపోతుందని సోషల్ మీడియాలో నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు. 1999 ప్రపంచకప్ సెమీస్‌లో ఫలితాన్ని ఆస్ట్రేలియా రిపీట్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

Spread the love