తెలంగాణ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి : మంత్రి సబిత


నవతెలంగాణ హైదరాబాద్:
తెలంగాణ విద్యారంగంలో గత పదేళ్లలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో విద్యాశాఖ పనితీరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా 21 రోజుల పాటు విద్యారంగంలోని విజయాలకు సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. 20న నిర్వహించే ‘తెలంగాణ విద్యా దినోత్సవం’ విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.
ప్రాథమిక పాఠశాల నుంచి పీజీ వరకు అన్ని విద్యాసంస్థల్లో సభలు, సమావేశాలను నిర్వహించి విజయాలను వివరించాలని సూచించారు. సర్కారు పాఠశాలలకు సకల హంగులు కల్పించే లక్ష్యంతో చేపట్టిన ‘మన ఊరు – మన బడి’, ‘మన బస్తీ – మన బడి’ కింద సకల వసతులతో ఆధునికీకరించిన ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. తొలి విడతలో రూ.3,497.62కోట్లతో 9,123 స్కూళ్లను 12 అంశాలను ప్రాతిపదికగా తీసుకొని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 10వేల గ్రంథాలయాలను, 1,600 డిజిటల్ క్లాస్ రూమ్‌లను ఒకే రోజున ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రూ.190కోట్లు ఖర్చు చేసి 30లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలు పునః ప్రారంభం నాటికి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మొదటి సారిగా రూ.60కోట్లు వెచ్చించి 6 నుంచి 10వ తరగతి చదువుతున్న 12.39 లక్షల మంది విద్యార్థులకు నోటు పుస్తకాలను అందిస్తున్నామని, వీటిని పాఠశాలలు పునః ప్రారంభం నాటికి విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 2లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు రూ.10కోట్ల ఖర్చుతో ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 26లక్షల మంది విద్యార్థులకు రూ.150 కోట్లు వెచ్చించి ఒక్కో విద్యార్థికి రెండేసి జతల యూనిఫామ్ అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. విద్యారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, విద్యారంగంపై వెచ్చిస్తున్న మొత్తాన్ని పెట్టుబడిగా భావిస్తోందని మంత్రి తెలిపారు. సమావేశంలో పాఠశాల విద్యా సంచాలకులు దేవసేన, అధికారులు రమేశ్‌, జయప్రద, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love